Congress | ‘రాత్ గయి బాత్ గయి’ అన్నట్టు ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ పెద్ద లీడర్ల యవ్వారం. ఈసారి పారాచూట్ లీడర్లకు టికెట్లు ఇచ్చేది లేదని, పార్టీ కోసం కష్టపడ్డోల్లకే టికెట్లు ఇస్తమని హస్తం పార్టీ నేతలు పెద్ద పెద్ద మాటలు చెప్పిర్రు. తీరా చూస్తే ప్రకటించిన వంద టికెట్లల్ల దగ్గర దగ్గర 30కి పైన టికెట్లు పారాచూట్ లీడర్లకే అప్పజెప్పిర్రు. క్యాండేట్ల లిస్టులు చూసి టికెట్లపై ఆశలు పెట్టుకున్న ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లకు కరెంట్ షాక్ కొట్టినంత పనయ్యింది. నిజంగనే ఈసారి పార్టీకి పని చేసినోల్లకే టికెట్లు ఇస్తరని చాలామంది లీడర్లు ఆశలు పెట్టుకున్నరు. టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకొమ్మని పిలువంగానే ఫుల్ ఖుషీ అయ్యిర్రు. ఖద్దరు బట్టలకు గంజేసుకొని, కార్లలో జనాలను ఎక్కించుకొని గాంధీ భవన్కు క్యూ కట్టిర్రు.
ఓసీ లీడర్లు రూ. 50 వేలు, బీసీ లీడర్లు రూ. 25 వేలు కట్టి మరీ దరఖాస్తు చేసుకున్నరు. పాపం చోటామోటా లీడర్లు కూడా అప్పోసప్పో చేసి టికెట్లకు అప్లికేషన్లు ఇచ్చిర్రు. అందుకే 119 నియోజకవర్గాలకు 1020 దరఖాస్తులు వచ్చినయ్. ఈ దరఖాస్తులన్నీ చెత్తబుట్టలో పడేసింది కాంగ్రెస్ పార్టీ. నిన్నియ్యాల్ల చేరిన లీడర్లకు టికెట్లు ఇచ్చింది. పాపం పార్టీ మాటలు నమ్మి టికెట్లపై ఆశలు పెట్టుకున్నోల్లు ఆగమయ్యిర్రు. ఈయింత దానికి దరఖాస్తులు ఎందుకు అడిగిర్రు ? పైసలెందుకు తీసుకున్నరు ? అని అగ్గి మీద గుగ్గిలం అయితున్నరు. మా పైసలు మాకు ఇస్తారా, అవి గిట్ల అటేనా అని ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకుంటున్నరట. ‘అయినా తప్పంతా మాదే. కాంగ్రెస్ గురించి తెలిసి గిట్ల పైసల్ కట్టి దరఖాస్తులు పెట్టుకొని బకరాలమయినం’ అని బాధపడిపోతున్నరు.
-సందీప్ రెడ్డి