హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): అధికారంలో ఉండి కుల గణన చేయని భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే ఎలా నమ్ముతామని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు ప్రశ్నించారు. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో బీసీ ముఖ్యమంత్రి అని అన్నారే తప్ప.. బీసీలకు ఏంచేస్తారో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పలేదని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదేండ్లలో ఒకసారి జరిగే జనగణనను కూడా చేయని ప్రధానిగా నరేంద్రమోదీ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.
బీసీల స్థితిగతులపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన జస్టిస్ రోహిణి కమిషన్ పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ముందు ఆ అంశంపై దృష్టి సారించాలని హితవు పలికారు. కేసీఆర్ కుటుంబ పాలన అని విమర్శలు చేసే నరేంద్రమోదీకి వారి పార్టీ నేతల కుటుంబ సభ్యుల రాజకీయ పదవులు, క్రీడల్లో ఉన్నతస్థానాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకు జైషాకు బీసీసీఐలో పదవి ఎలా వచ్చింది? అని నిలదీశారు. తెలంగాణకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వడం చేతకాని ప్రధాని.. తెలంగాణ విద్యావ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. తెలంగాణలో బీసీ కులాలు కేసీఆర్ పాలనలో ఆర్థికంగా, ఆనందంగా ఉన్నాయని చెప్పారు.