హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): వానకాలానికి అవసరమైన విత్తనాలు సిద్ధం చేయాలని, రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలే అందుబాటులో ఉంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పోలీసుశాఖతో సమన్వయం చేసుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం విత్తన కంపెనీలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వానకాలంలో 134.66 లక్షల ఎకరాల్లో సాగు జరిగే అవకాశముండగా, దానికి 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని, ప్రస్తుతం 38.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరానికి రెండింతలు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
52 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని, ఇందుకోసం 104 లక్షల ప్యాకెట్లు అవసరం కాగా 212.11 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధులు మంత్రి తుమ్మలతో భేటీ అయ్యారు. రైతులకు సాగుకు ముందుగానే వాతావరణ పరిస్థితులు, వర్షపాతం వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో వాట్సాప్ ద్వారా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు ప్రభుత్వ సహకారం అందించాలని ప్రతినిధులు మంత్రిని కోరారు. దీనిపై సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని మంత్రి తుమ్మల ఆదేశించారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న, ఎగుమతులకు అవకాశాలున్న వరి రకాలను అభివృద్ధి చేయడంపై వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని రాష్ట్ర రైస్ మిల్లుల ప్రతినిధులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తిచేశారు. గురువారం రైస్ మిల్లుల రాష్ట్ర సంఘ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు.
ఎంటీయూ1010, కేఎన్ఎం118, ఐఆర్64 వంటి రకాలకు మారెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ, ఎగుమతులు మాత్రం ఇంకా పొడవైన గింజలున్న రకాలు పండించే పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచే అధికంగా జరుగుతున్నాయని వారు మంత్రికి వివరించారు. తెలంగాణలో సన్న రకాలుగా పరిగణించే కొన్ని వరి రకాలు ఎఫ్సీఏ గ్రేడ్ ‘ఏ’లోకి రావడం లేదని, ఆ అంశాన్ని పరిశీలించాల్సిందిగా మిల్లర్లు అభ్యర్థించారు. అందరి అభిప్రాయాలు పరిశీలించి, వరి సన్న రకాల ఎంపికను శాస్త్రీయం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.