పెద్దపల్లి : బీజేపీ పార్టీకి ఉన్న చరిత్రల్లా విధ్వంసం, విద్రోహం సృష్టించడం, దాడులు, హత్యలకు పాల్పడడం. అంతే తప్పా ప్రజా సంక్షేమం ఏమీ లేదని ఆ పార్టీపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో బీజేపీ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు.
దళిత నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగుర వేస్తామని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఏడున్నర ఏళ్లలో దళితులకు దేశవ్యాప్తంగా చేసిందేమిటి? దళితులు, బీసీలు, మైనారిటీలకు బీజేపీ ప్రభుత్వం కొత్త గా తీసుకొచ్చిన పథకం ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు.
దళిత బహుజనుల కోసం బీజేపీ చేసింది శూన్యం అని విమర్శించారు.బండి సంజయ్ కు దమ్ముంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నేరపూరితమైన మతతత్వ పార్టీ బీజేపీకి టీఆర్ఎస్ను విమర్శించే నైతికత లేదు. మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, ప్రేమేందర్ రెడ్డిలు దళిత నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగరేస్తాం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, దేశంలో అధికారంలో ఉండి దళితులకు చేసింది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ దళిత బహుజనులపై చూపిస్తున్న కపట ప్రేమను బహిర్గత పరిచి బయటకి రావాలని హితవు పలికారు.