మేడ్చల్ మల్కాజిగిరి : విద్యాసంస్థల పరిసర ప్రాంతాలు, వలస కూలీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని గంజాయి(Ganja) విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.2లక్షల 15వేల విలువ చేసే 6.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు.
బాచుపల్లి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఒడిషాకు చెందిన రోహిత్ మచ్చ(19), కూకట్పల్లి ప్రకాశ్నగర్కు చెందిన బోగి దుర్గాప్రసాద్(21),బొల్లారంలోని యాప్రాల్లో నివాసం ఉంటున్న కౌకూర్కు చెందిన పర్దేం ఒమేశ్ అనే వ్యక్తులు విద్యాసంస్థల పరిసర ప్రాంతాలను ఎంపిక చేసుకుని గత కొంత కాలంగా గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్వోటీ పోలీసులు మంగళవారం రాత్రి నిజాంపేట్లోని ఓ కళాశాల రోడ్డులో ముగ్గురు వ్యక్తులు గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా రెడ్హ్యాండేడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 6.4కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లను సీజ్ చేశారు. అనంతరం బాచుపల్లి పోలీసులకు అప్పగించారు.ఈ మేరకు ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించారు.