హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సోమవారం జలసౌధలో నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ ఇప్పటికే సమాచారం అందించింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమకాలువ నుంచి 15 రోజులపాటు రోజుకు 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఇటీవల ప్రతిపాదించారు. మరోవైపు ఇప్పటికే ఏపీ తన కేటాయింపులకు మించి జలాలను వినియోగించుకున్నదని, సాగర్ కుడిగట్టు కేంద్రం ద్వారా పెద్ద మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నదని ఇటీవల కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ రెండు అంశాలపై చర్చించేందుకు 13న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.