హైదరాబాద్: నగర శివార్లలోని దుండిగల్ (Dundigal) బౌరంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటినతర్వాత బౌరంపేటలో ఉన్న కోకాకోల కంపెనీ వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన అశోక్ను (ఏలూరు) సూరారంలోని దవాఖానకు తరలించారు. మృతులను ఆంధ్రప్రదేశ్లోని విజవాడకు చెందిన చరణ్, పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు చెందిన సంజూ, గణేశ్గా గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. వీరంతా మద్యం సేవించారని, నిజాంపేట్లో ఉంటూ ఉద్యోగాలకోసం ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రమాద సమయంలో కారును చరణ్ నడుపుతున్నాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.