KTR | పౌర సరఫరాల శాఖలో భారీ స్కాం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పేరుతో 700 నుంచి 750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కింద 2.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో 300 కోట్లు.. మొత్తంగా వెయ్యి కోట్ల కుంభకోణం చేశారని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. స్కాం వివరాలను వెల్లడించారు. ఈ కుంభకోణం రెండు భాగాలుగా జరిగిందని వివరించారు.
ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సేకరించి మిల్లర్ల దగ్గర ఉంచిన 35 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ల కహానీకి తెరలేపింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి.. జనవరి 25న కమిటీ వేసింది. అదే రోజు మార్గదర్శకాలు జారీ చేసి.. టెండర్లను పిలిచింది. ఇంకా విచిత్రమేంటంటే.. క్వింటాలుకు రూ.2100 కు కొనుగోలు చేయానికి రైస్ మిల్లర్లు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేసి.. గ్లోబల్ టెండర్లు పిలిచారు. ప్రత్యేక నిబంధలు పెట్టి కేవలం నాలుగు కంపెనీలకే టెండర్లు వచ్చేటట్టు చేశారు. కేంద్రీయ బండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ కంపెనీ, నాక్హాఫ్ అనే నాలుగు సంస్థలు ఈ టెండర్లను దక్కించుకున్నాయి. గురుకులాల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత సరిగ్గా పనిచేయలేదని కేంద్రీయ బండార్ అనే సంస్థను 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేంద్రీయ బండార్ సంస్థ కోసం రూల్స్ను రిలాక్స్ చేశారు.
మిల్లర్లు క్వింటాలుకు 210 చెల్లించి కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ఆ నాలుగు కంపెనీలకే టెండర్లు కట్టబెట్టారు. క్వింటాలుకు దాదాపు 200 తగ్గించి.. 1885-2007 రూపాయలకు కొనుగోలు చేసేలా ఒప్పందం చేశారు. ఈ టెండర్ మార్గదర్శకాల ప్రకారం 90 రోజుల్లో 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేసి.. ప్రభుత్వానికి రూ.7500 కోట్లు చెల్లించాలని నిబంధన పెట్టింది. టెండర్ గైడ్లైన్స్ ప్రకారం.. ఈ నాలుగు కంపెనీలు ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలి.. తప్ప ఏ లావాదేవీల్లో పాల్గొనవద్దు. కానీ వీళ్లు మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు చేస్తూ మనీలాండరింగ్కు పాల్పడ్డారు. గోదాముల్లోని ధాన్యాన్ని తీసుకుపోకుండా రైస్ మిల్లర్లపై బెదిరింపులకు పాల్పడ్డారు. టెండర్లు వేసింది 1885-2007 రూపాయలకు గానీ.. క్వింటాలుకు 2230 రూపాయలు చెల్లించాల్సిందే అని రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల మంది రైస్ మిల్లర్లను కాంట్రాక్ట్ సంస్థలు బ్లాక్మెయిల్ చేస్తున్నాయి.
క్వింటాలుకు రూ. 2007 కొనుగోలు చేయాలని కోట్ చేసినప్పటికీ మిల్లర్లు ఇంకో రూ.236 అదనంగా ఇవ్వాల్సిందేనని జలసౌధలో అనధికారికంగా ఒక ఒప్పందం కుదర్చుకున్నారు. సీఎం పేషీకి ఖర్చయ్యింది.. ఢిల్లీకి పోవాలి.. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి క్వింటాలుకు 150 నుంచి 236 రూపాయలు అదనంగా చెల్లించి తీరాలని రైస్ మిల్లర్లను ఒత్తిడి చేశాయి. దీనికి సహకరించకపోతే విజిలెన్స్, జీఎస్టీ దాడులు జరుగుతాయని బెదిరిస్తున్నాయి. క్వింటాలుకు రూ.236 ఎక్కువగా ఇస్తే.. ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు క్లియరెన్స్ ఇస్తామని బంపరాఫర్ కూడా ఇచ్చారు. అలా రైస్ మిల్లర్లపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి భారీ స్థాయిలో నగదు బదిలీ జరిగిందని సమాచారం అందింది. దాదాపు 35లక్షల మెట్రిక్ టన్నులకు 200 చొప్పున చూసుకున్నా 700 కోట్ల అదనపు డబ్బు మనీలాండరింగ్ ద్వారా మిల్లర్ల దగ్గర వసూలు చేస్తున్నారు.
కాంట్రాక్ట్ పొందిన సంస్థలు కేవలం 90 రోజుల్లో ధాన్యం లిఫ్ట్ చేయాలి.. చేయకపోతే ఏకారణంతో చేయలేదో చెప్పాలి.. 7,500 కోట్లు కట్టాలి. కానీ టెండర్ దక్కించుకున్న నాలుగు కంపెనీలు మాత్రం రైస్ మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. అసలు సంబంధంలేని ప్రైవేటు సంస్థలు.. ప్రభుత్వం తరఫున డబ్బులు ఎలా వసూలు చేస్తాయి? 2100కు కొంటామని మిల్లర్లు కొంటామని సుముఖత వ్యక్తం చేసినా 1800-2007 కింద బ్యాండ్ ఫిక్స్ చేసి.. ఎలిజిబిలిటీ క్రిటిరియా కింద ఎందుకు చిన్న చిన్న సంస్థలను ఎందుకు ఎగరగొట్టారో సమాధానం చెప్పాలి. మిల్లర్లకు ఇచ్చిన 90 రోజుల గడువు అయిపోయింది.. ఇప్పటికీ 20 శాతం కూడా లిఫ్ట్ చేయలేదు.. దీని వెనుక ఏం జరుగుతుంది.
డెడ్లైన్ అయిపోయిన తర్వాత నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.. బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. కానీ తమకు రావాల్సిన 700 కోట్లు మొత్తం వాళ్ల చేతికి రాలేదు కాబట్టి ఈ డెడ్లైన్ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మిల్లర్లను బెదిరించి ఇవాళ అదనంగా డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారు. మిల్లుల్లోని ధాన్యాన్ని లిఫ్ట్ చేస్తేనే.. స్థలం ఖాళీ అవుతుంది.. అప్పుడు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి.. ఒకవేళ జరగకపోతే 150 కోట్ల వడ్డీని అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి పౌరసరఫరాల శాఖకు వస్తుంది.’ అని కేటీఆర్ తెలిపారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు.. ఎంత లిఫ్ట్ చేశారో శ్వేతపత్రం ప్రచురించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బ్లాక్ లిస్ట్లో పెట్టిన కేంద్రీయ బండార్పై వెంటనే బ్లాక్లిస్ట్ నుంచి తీసేసి టెండర్లో పాల్గొనేందుకు అనుమతించారో ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు. ఇందులో వందల కోట్లు ముట్టిన మాట వాసస్తవమో కాదో ఎంక్వైరీ ద్వారా తేల్చాలన్నారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో సన్న బియ్యం అందించే స్కీమ్ తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందులో కూడా స్కామ్ చేశారని చెప్పారు. ‘ మధ్యాహ్న భోజన పథకానికి 2.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కావాలి. దీనికోసం పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ పిలిచింది. ఇందులో కూడా అవే నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర 42-45 రూపాయలు ఉంది. కానీ బహిరంగ మార్కెట్, మిల్లర్లను పక్కనబెట్టి టెండర్ల పిలిచారు. కిలోకు 15 రూపాయలు అదనంగా అంటే 57 రూపాయలతో టెండర్ ఖరారు చేశారు. 2.20 లక్షల మెట్రిక్ టన్నులకు 15 రూపాయలు అదనంగా అంటే 300 కోట్ల స్కామ్ జరిగింది. మొత్తంగా వెయ్యి, 1100 కోట్ల స్కామ్ జరిగింది. ‘ అని కేటీఆర్ వివరించారు.
‘ ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని రైతుల నుంచి పౌరసరఫరాల శాఖ కొని.. ఎఫ్సీఐకి అమ్ముతుంది. రైతుల నుంచి దొడ్డు, సన్న రకాల వడ్లు కొంటాం. మా ప్రభుత్వం హయాంలో కొనుగోలు చేసిన దాంట్లో 1.6 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉంది. దాన్ని మిల్లింగ్ చేసి స్కూల్ డిపార్ట్మెంట్కు ఇస్తే.. కేవలం 60 వేల టన్నులు కొనాల్సి వచ్చేది. కానీ 1.6 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉన్నప్పటికీ దాన్ని రూ.22.59 పైసలకు అమ్మేశారు. అలా కాకుండా ఈ ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి సన్న బియ్యం తీసుకోవచ్చు. తద్వారా లక్ష టన్నుల సన్న బియ్యం కేవలం రూ.35కే వచ్చేది. ఈ లక్ష టన్నులు పోనూ మిగిలిన దానికి టెండర్లు పిలుచుకోవాల్సింది. కానీ ఆ ధాన్యాన్ని అమ్మి.. సన్న బియ్యాన్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు’ అని తెలిపారు.