సంగారెడ్డి : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హానికారక పార్టీలని, రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో అందోలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్దన్న పాటిల్, శ్రీనివాస్రెడ్డి, బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నాగరాజు తమ అనుచరులతో కలిసి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీశ్రావు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య పాలనలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందన్నారు. ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ పార్టీ సైతం ప్రస్తుతం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు చెప్పేవి అన్ని అబద్దాలని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీలు ఒంటిరిగా టీఆర్ఎస్ను ఎదుర్కొనలేక కుట్రలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే హైకమాండ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. ఈ విషయాలను ప్రజలు ఒకమారు ఆలోచించాలని కోరారు.
తెలంగాణ పనిచేసే పార్టీలు ఉండాలా?హాని చేసే పార్టీ వైపు ఉండాలా అన్నది ప్రజలు ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ నాయకులు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.