హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ది రియల్ఎస్టేట్ సర్కార్ అని, రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదు, ప్రజావంచన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. మూసీ నదీ పరిసరాల్లో రూ.ఐదు వేల కోట్లతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేసేందుకు 500 కుటుంబాలు, 2,500 జనాభా నివసిస్తున్న ప్రాంతాన్ని చెరబట్టాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. తమ తాత పేరుతో ఇలాంటి పనులు చేయవద్దంటూ మహాత్మాగాంధీ మనవడు తుషార్గాంధీ స్వయంగా ఆవేదన వ్యక్తంచేసిన విషయాన్ని ప్రస్తావించారు. తమ తాత బతికి ఉంటే ఇలాంటి చర్యలను సమర్థించరంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి తుషార్గాంధీ ఆవేదనతో విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు.
500 కుటుంబాలు గత కొన్నాళ్లుగా కంటి మీద కునుకు లేకుండా, తిండి సహించక ఆందోళన చెందుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. క్యాబినెట్ సమావేశంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు, రైతుభరోసా గురించి ఒకమాట కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, మంత్రులు భూములను కేకు ముకలుగా చేసి పంచుకుంటున్నారని విమర్శించారు.
తెల్లారేసరికి ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో పదేండ్లుగా ఉన్న పేదల ఇండ్ల మీద పడ్డారని మండిపడ్డారు. లాఠీలను అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలను లూఠీ చేస్తున్నారని విమర్శించారు. పేదలు, మధ్యతరగతి వర్గాలు జీవితకాలం కష్టపడి నిర్మించుకున్న ఆశల సౌధాలను కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. గాంధీ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల దోపిడీకి సరార్ పెద్దలు రంగం సిద్ధంచేసుకుంటున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.