(స్పెషల్ టాస్క్ బ్యూరో)
Mortality rate | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశంగా రికార్డు సృష్టించిన భారత్.. మాతా-శిశు మరణాల్లోనూ అగ్రస్థానంలో ఉన్నది. దేశంలో ఏటా సగటున 8 లక్షల ప్రసూతి, నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, టాంజానియా వంటి పేద దేశాలతో పాటు ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న పొరుగు దేశాలు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ కంటే మన పరిస్థితి దయనీయంగా ఉండటం గమనార్హం. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి (ఐరాస) తాజా నివేదిక ద్వారా వెల్లడైంది.
మరణాల పెరుగుదలకు కారణమిదే!
మాతా, శిశు ఆరోగ్య సంరక్షణకు నిధులను కేటాయించడంలో ప్రపంచ దేశాలు అశ్రద్ధ చేస్తున్నాయని ఫలితంగా మరణాలు అంతకంతకూ పెరుగుతున్నట్టు ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. 2015 నుంచి 8 ఏండ్ల డేటాను విశ్లేషించినట్టు వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 45 లక్షల ప్రసూతి, నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నట్టు ఐరాస వెల్లడించింది. 60 శాతం మరణాలు పది దేశాల్లోనే నమోదవుతున్నట్టు వివరించింది. చికిత్స చేయడానికి వీలున్న రోగాల కారణంగానే మరణాలు సంభవిస్తుండటం విచారకరమని అభిప్రాయపడింది.
చైనా కంటే చాలా దారుణం
భారత్లో మాతా-శిశు మరణాలు ఎక్కువగా ఉండటానికి ఎక్కువ జనాభానే కారణమన్న వాదన సహేతుకంగా లేదని నిపుణులు చెబుతున్నారు. గతంలో జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనాను ఉదహరిస్తున్నారు. ఐరాస తాజా జాబితాలో లక్ష మాతా-శిశు మరణాలతో చైనా ఏడో స్థానంలో ఉండగా, 8 లక్షల మరణాలతో భారత్ తొలి స్థానంలో ఉన్నది. నివేదిక రూపొందించే సమయానికి భారత్, చైనా జనాభా దాదాపుగా సమానం. చైనాతో పోలిస్తే, భారత్లో మరణాలు 8 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ గణాంకాలను విశ్లేషిస్తే, చైనాతో పోలిస్తే, భారత్లో వైద్య సదుపాయాలు మెరుగ్గా లేవన్న విషయం అర్థమవుతున్నది.
ప్రతి ఏడు సెకండ్లకు ఒక మరణం..
ప్రపంచవ్యాప్తంగా ఏటా మాతా, శిశు మరణాలు : 45 లక్షలు
ప్రసూతి మరణాలు : 2,90,000
నవజాత శిశు మరణాలు : 23 లక్షలు
ఆరునెలల్లోపు శిశు మరణాలు: 19 లక్షలు