Godavari | ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టిన ప్రవాహం అర్ధరాత్రి నుంచి పెరుగుతూ వచ్చింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 52 అడుగులకు చేరుకున్నది. రాత్రి 9 గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 53.1 అడుగులకు చేరింది. దీంతో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శనివారం ఉదయం నాటికి 56 అడుగులకు పైగా నీటిమట్టం చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే యంత్రాంగం 430 గ్రామాలకు చెందిన ప్రజలను 40 పునరావాస కేంద్రాలకు తరలించారు.
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు. గుండాల మండలం ముత్తాపురంలో వరదలో చిక్కుకున్న 12 మందిని రక్షించిన ఐదుగురు గజ ఈతగాళ్లను మల్టీ జోన్ -1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి అభినందించి నగదు ప్రోత్సాహకాలను అందించారు. ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యుడు అశ్వాపురం, బూర్గంపహాడ్ మండలాల్లో పర్యటించి వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారిని పరామర్శించి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
భద్రాచలం వద్ద వరదనీటి ప్రవాహం పెరుగుతుండటంతో పట్టణ ప్రాంతంలోని విస్తాక్లాంప్లెక్స్, దేవాలయ ప్రాంగణ పరిధిలోకి వరద చేరకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీటిని మోటర్ల ద్వారా తిరిగి గోదావరిలోకి మళ్లిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. వరద తగ్గుముఖం పట్టే ప్రాంతాల్లో తక్షణం శానిటేషన్ చేయించేలా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ ప్రియాంక ఆల భద్రాచలంలోనే మకాం వేసి వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్తో పాటు ప్రత్యేకాధికారి అనుదీప్, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, భద్రాద్రి ఎస్పీ వినీత్, భద్రాచలం ఏఎస్పీ పారితోశ్పంకజ్ వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.