హైదరాబాద్/జగిత్యాల సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం ప్రగతి మైదాన్ : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని నియమించినట్టు ఆ పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత.. ఆ పోస్టును భర్తీ చేసేందుకు తిప్పిరి తిరుపతిని కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించినట్టు వెల్లడించింది. ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్తో భద్రతా దళాల నిరంతర కూంబింగ్ కారణంగా దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ బలహీనపడింది. డజన్ల కొద్దీ సీనియర్ మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోవడం, మరింకొందరు కిందిస్థాయి రాష్ట్ర, డివిజన్ కమిటీ సభ్యులు లొంగిపోవడంతో పార్టీ పునర్నిర్మాణం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జిగిత్యాలకు చెందిన దళిత నాయకుడు తిప్పరి తిరుపతిని కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అదే సమయంలో పీఎల్జీఏ మొదటి బెటాలియన్ కమాండర్ అయిన మడావి హిడ్మా అలియాస్ సంతోష్కు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. పీపుల్స్వార్ పార్టీ చరిత్రలోనే అత్యంత కీలకమైన జగిత్యాల జైత్రయాత్ర రోజున మావోయిస్టు కేంద్ర కమిటీలో అత్యున్నత స్థానమైన కార్యదర్శిని ఎన్నుకోవడం గమనార్హం.
కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి దాదాపు 43 ఏండ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. దళిత కుటుంబంలో పుట్టిన ఆయన.. ఇంటర్ వరకు కోరుట్లలోనే చదివారు. 1978 ప్రాంతంలో రైతుకూలీ పోరాటాలు, విద్యార్థి సంఘాలు, రాడికల్ స్టూడెంట్ యూనియన్ పోరాటాల్లో పాల్గొని కూలీరేట్ల పెంపుదలలో భాగస్వాములయ్యారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ కోరుట్ల శాఖలో కీలకంగా ఉన్న ఆయన 1982లో ఆర్ఎస్యూ విద్యార్థులపై సాగిన మారణహోమంపై ఒగ్గుకథ రూపంలో ప్రచారం చేశారు. ఆరెస్సెస్, ఏబీవీపీ తిరుపతిపై పలుమార్లు దాడులకు దిగాయి. అప్పట్నుంచే పీపుల్స్వార్ కార్యక్రమాల ప్రాధాన్యం వివరించడంతో ఆయనపై నిర్బంధం పెరిగిపోయింది. పలుకేసులతో జైలుకు సైతం వెళ్లారు.
గణపతి కార్యదర్శిగా పీపుల్స్వార్ పార్టీ తన ప్రస్తానాన్ని కొనసాగించిన క్రమంలో మల్లోజుల కోటేశ్వర్రావు, నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్, పులి అంజన్న, ఎర్రంరెడ్డి సంతోష్రెడ్డి, నంబాల కేశవరావు, మాధవ్, తిప్పిరి తిరుపతి కీలక భూమిక పోషించారు. పీపుల్స్వార్లో దళ సభ్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన తిరుపతి, పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా, ఛత్తీస్గఢ్ స్టేట్ కమిటీ మెంబర్గా, దళ కమాండర్గా, జోనల్ కమిటీ మెంబర్గా, స్టేట్ కమిటీ మెంబర్గా, ప్లాటూన్ కమాండర్గా పనిచేసినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ మిలటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తున్నట్టు సమాచారం. 2010వ సంవత్సరంలో ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో 74 మంది జవాన్ల మృతికి కారణమైన ఘటనలో తిప్పిరి తిరుపతి కీలక పాత్ర పోషించారు. పీపుల్స్వార్, మరికొన్ని విప్లవ గ్రూపులు కలిసి 2004లో మావోయిస్టు పార్టీగా అవతరించాయి. పీపుల్స్వార్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణ్రావును మావోయిస్టు కేంద్ర కమిటీ తొలి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వృద్ధాప్యం నేపథ్యంలో గణపతి స్థానంలో నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన ఈ ఏడాది మేలో ఎదురుకాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ కొత్త కార్యదర్శిగా మావోయిస్టు పార్టీ మిలటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న తిప్పిరి తిరుపతిని నియమించినట్టు ప్రకటించింది.