మెదక్ : దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. ఏం ముఖం పెట్టుకొని తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. జిల్లాలోని టేక్మాల్ మండలం హసన్ మహ్మద్పల్లిలో 56 మంది దళిత బంధు లబ్ధిదారులకు వరికోత యంత్రం, ట్రాక్టర్లు, వాణిజ్య వాహనాలు, టెంట్ సామగ్రి, మినీ డెయిరీ యూనిట్లను పంపిణీ చేసి మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతుంటే..టీఆర్ఎస్ పేదలకు పంచే పనులు చేస్తుందని మంత్రి తెలిపారు. బీజేపీ రోజు రోజుకు ధరలు పెంచుతూ.. పేదల ఉసురు పోసుకుంటున్నదని ఆరోపించారు. కేంద్రానికి పేదల మీద ప్రేమ ఉంటే గ్యాస్ ధర తగ్గించాలి, సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న బీసీల కోసం బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంక్ గానే చూసింద తప్పా.. వారికి ఏనాడు ఏం చేయలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా కూడా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు అవుతున్న వంటి పథకాలు మరెక్కడా లేవన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏ మొఖం పెట్టుకుని తెలంగాణలో యాత్రలు చేస్తారని సూటిగా ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.