సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపు పేరిట సైబర్ మోసాలు జరిగే అవకాశముందని, ప్రజలంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. లబ్దిదారుల నుంచి రూ.10వేలు ముందస్తు డిపాజిట్ చెల్లించే ప్రక్రియ ప్రారంభం కావడంతో సైబర్ నేరగాళ్లు నకిలీ కాల్స్, అపరిచిత లింక్స్తో బురిడీ కొట్టించే ప్రమాదముందని ఆయన తెలిపారు.
ఈ పథకంలో ఎలాంటి దళారులు లేదా మధ్యవర్తులకు అవకాశం లేదని, ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం చెల్లించిన ఈఎండీ సొమ్ము భద్రంగా ఉంటుందని, ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాకే ప్రభుత్వం నేరుగా జమచేస్తుందని వివరించారు. డబ్బులు చెల్లిస్తే ఇల్లు ఖచ్చితంగా ఇప్పిస్తామంటూ చెప్పే వారి మాటలు నమ్మవద్దని, ఈ రోజే ఆఖరు తేదీ వెంటనే డబ్బులు కట్టకపోతే ఇల్లు రద్దవుతుందంటూ భయపెట్టి తొందరపాటులో నగదు బదిలీ చేయించుకోవడం నేరగాళ్ల ప్రధాన ఎత్తుగడగా సజ్జనార్ పేర్కొన్నారు.
వాట్సాప్ లేదా మెసేజ్ల ద్వారా వచ్చే అపరిచిత లింకులను నమ్మి ఏపీకే ఫైళ్లను ఇన్స్టాల్ చేస్తే ఫోన్ హ్యాక్ అయి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని తెలిపారు. ప్రభుత్వ పోర్టళ్లను పోలిన నకిలీ వెబ్సైట్లను సృష్టించే అవకాశముందని, అంతేకాకుండా మీకు గైడ్ చేస్తామంటూ ఎనీ డెస్క్, టీమ్వ్యూయర్ వంటి స్క్రీన్ షేరింగ్యాప్లను డౌన్లోడ్ చేయించి బ్యాంకు వివరాలు కాజేసే అవకాశమున్నదని తెలిపారు. యూపీఐ పిన్ అనేది కేవలం డబ్బులు చెల్లించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, రీఫండ్ సొమ్మును స్వీకరించడానికి పిన్ నెంబర్ నొక్కాల్సిన అవసరం లేదనే విషయాన్ని లబ్దిదారులు గుర్తుంచుకోవాలన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీజ్ చేసేందుకు 1930 ఉచిత హెల్ప్లైన్కు కాల్ చేయాలని సజ్జనార్ సూచించారు.