భూత్పూర్, జూన్ 28 : ‘అయ్యా.. కేసీఆర్ సారు మళ్లెప్పుడు వస్తారు? కేసీఆర్ పెంచిన పింఛనే ఇప్పటికీ ఇస్తున్నారు..కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మి మోసపోయాం’ అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలతో వృద్ధులు వాపోయారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆల వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని కొంతమంది వృద్ధులు ఆయన వద్దకు వచ్చి అయ్యా బాగున్నావా.. అని పలుకరించారు. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల సమయంలో పింఛన్ రూ.4,000, ఆడవాళ్లకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పిన మాటలకు మోసపోయి కారు పార్టీని దూరం చేసుకున్నామని వాపోయారు. ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నామని చెప్పారు. కాంగ్రెసోళ్లు వచ్చినంక రైతుభరోసా రావడంలేదని, యూరియా దొరుకుతలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే ఆల స్పందిస్తూ ..‘మీరేం దిగులు చెందకండి, మళ్లీ వచ్చేది మన పార్టీయే.. కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అవుతారు.. మన పనులను మనం చేసుకుందాం’ అని ధైర్యం చెప్పారు.