Telangana Cabinet Meeting | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి, ఆమోదించింది. 2022 సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభ దినం’ పాటించాలని నిర్ణయించింది. మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది.
రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమానికి 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్న నేపథ్యంలో.. సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటిస్తూ.. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది. వజ్రోత్సవాల ముగింపు వేడుకలను వచ్చే ఏడాది 2023 సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది.
‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభంలో భాగంగా మూడు రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలను సైతం నిర్ణయించింది. 16న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులతో భారీ ర్యాలీలు నిర్వహిస్తారు. 17న సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రసంగిస్తారు. అదేరోజు అన్ని జిల్లాల్లో మంత్రులు, మున్సిపాలిటీలు, పంచాయతీ కేంద్రాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాను ఆవిష్కరింస్తారు. అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్లోని బంజారాభవన్, ఆదివాసీ భవన్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరా పార్క్ వద్దనున్న ఎన్టీఆర్ స్టేడియం వరకు గుస్సాడీ, గోండు, లంబాడీ తదితర కళారూపాలతో సాంస్కృతిక ప్రదర్శనలతో భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. 18న అన్ని జిల్లాకేంద్రాలో స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించడంతో పాటు కవులు, కళాకారులను గుర్తించి సత్కరిస్తారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ’ స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి’ అని కేబినెట్ తీర్మానించింది.
పోడు భూముల విషయంపై సైతం క్యాబినెట్ సుధీర్ఘంగా చర్చించింది. గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారానికి ఆయా జిల్లాలవ్యాప్తంగా రెవెన్యూ, ఫారెస్టు, ట్రైబల్ వెల్ఫేర్శాఖల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో, ప్రతి జిల్లాలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు చేపట్టాలని కేబినెట్ సూచించింది.
రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం అందచేస్తున్న వంద మందితో పాటు ప్రతి నియోజకవర్గానికి మరో 500 మందికి దళిత బంధు పథకాన్ని విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా అమలుచేస్తున్న నేపథ్యంలో, మిగిలిన 118 నియోజక వర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది అర్హులైన లబ్ధి దారులను గుర్తించి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.