T Congress | హైదరాబాద్/సిటీబ్యూరో/కీసర/కొల్లాపూర్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ తొలి జాబితా ఆ పార్టీలో అగ్గి రాజేసింది. వివిధ సామాజికవర్గాల్లో అసమ్మతి సెగలు ఎగిసిపడ్డాయి. ఆదివారం 55 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించడమే ఆలస్యం ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. టికెట్ల రేసులో భంగపడ్డ ఆశావహులు, మద్దతుదారులు కోపోద్రిక్తులయ్యారు. ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ పలుచోట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహ నం చేశారు. పాతబస్తీకి చెందిన మైనార్టీ నేతలతోపాటు గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు కార్యకర్తలు ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ను ముట్టడించారు. గద్వాల కార్యకర్తలు గాంధీభవన్ లోపలి గేటు కు తాళం వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపట్టింది. మేడ్చల్, ఉప్పల్, కొల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లోనూ అసంతృప్త సెగలు ఎగిసిపడ్డాయి. రేవంత్ కబంధహస్తాల నుంచి పార్టీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. పలు నియోజకవర్గాల్లోని కీలకనేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. సగం కంటే తక్కువ స్థానాలకే అభ్యర్థులను ప్రకటిస్తేనే ఈ స్థాయిలో రచ్చ జరిగితే ఇక మొత్తం స్థానాలకు అభ్యర్థుల జాబి తా విడుదలైతే పరిస్థితి ఇంకెలా ఉండేదోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
నెల క్రితమే పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావుకు టికెట్ ఎలా ఇస్తారని పీసీసీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాదర్పాషా ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ కోసం పనిచేసినవారిని గుర్తించకుండా ప్యారాచూట్ నేతలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ టికెట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి మాటలను నమ్మి జగదీశ్వర్రావు రూ.కోట్ల ఖర్చు చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వం చెప్పేదొకటి, చేసేది మరొకటని మండిపడ్డారు.
మేడ్చల్లో కాంగ్రెస్ వర్గవిబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మేడ్చల్ టికెట్ను బోడుప్పల్ నివాసి తోటకూర జంగయ్యయాదవ్కు కేటాయించడంతో ఆ టికెట్ను ఆశించిన హరివర్ధన్రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆయనను కలిసేందుకు వచ్చిన జంగయ్యయాదవ్కు తీవ్ర పరాభవం ఎదురైంది. ఆదివారం కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైన తరువాత హరివర్ధన్రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే జంగయ్యయాదవ్ అక్కడకు రావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జంగయ్యయాదవ్ గోబ్యాక్ అంటూ హరివర్ధన్రెడ్డి వర్గీయులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల కార్యకర్తలు దుర్భాషలాడుతూ, గల్లాలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
ఉప్పల్ అభ్యర్థిగా పరమేశ్వర్రెడ్డిని ప్రకటించడంతో టికెట్ ఆశించి, భంగపడిన రాగిడి లక్ష్మారెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఫ్లెక్సీలను చించివేసి, ఆయ న దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోవైపు ఏఎస్రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష, ఆమె భర్త, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సోమశేఖర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు.
ముషీరాబాద్ టికెట్ను హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్కుమార్యాదవ్కు కేటాయించడంపై పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ముదిరాజ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో తన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. కొ ల్లాపూర్ టికెట్ను ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కేటాయించడం తో ఆ టికెట్ను ఆశించిన చింతలపల్లి జగదీశ్వర్రావు వర్గీయులు కోపోద్రిక్తులయ్యా రు. కొల్లాపూర్లో జగదీశ్వర్రావు ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆ యన అనుచరులు ఆగ్రహంతో ఊగిపోయారు. కార్యాలయంపై ఏర్పాటు చేసిన బోర్డుతోపాటు రేవంత్రెడ్డి, వంశీకృష్ణ, మల్లురవి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను చించేశారు. వాటికి నిప్పుపెట్టేందుకు ప్రయత్నిస్తుండగా కార్యాలయ సి బ్బంది అడ్డుకున్నారు. జగదీశ్వర్రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోతే, భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు. సోమ వారం చింతలపల్లి సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణను అనుచరులతో చర్చించనున్నా రు. పార్టీ నాయకులు, అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఆ దిశగా ముందుకు వెళ్తామని చింతలపల్లి తెలిపారు.
పాతబస్తీలోని పలు సీట్లను మైనార్టీలకు కాకుండా స్థానికేతరులకు, ఇతర సామాజికవర్గాల వారికి కేటాయించడంతో ఆయా టికెట్లను ఆశించిన మైనార్టీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గాంధీభవన్ను ముట్టడించడమే కాకుండా ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఏర్పాటుచేసిన ప్రెస్మీట్ను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బహదూర్పుర టికెట్ను రాజేశ్కుమార్కు కేటాయించడంపై యూసఫ్దానిష్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. చాంద్రాయణగుట్ట టికెట్ కేటాయింపు విషయంలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. యాకత్పురతో సంబంధం లేని రవిరాజుకు టికెట్ ఎలా కేటాయించారని నిలదీశారు. మలక్పేట టికెట్ను అక్బర్కు కేటాయించడంతో ఆ టికెట్ ఆశించిన ముజఫర్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో మల్లు రవి ప్రెస్మీట్ను రద్దు చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా ఆశావహుల మద్దతుదారులు గాంధీభవన్ వద్ద ఆందోళనను కొనసాగించారు.