Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి, జనవరి 25 (నమస్తేతెలంగాణ)/మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అక్టోబర్లో బరాజ్లోని ఏడో బ్లాక్లో 20వ పియర్ కుంగిన ఘటనపై మూడు నెలలుగా విచారణ కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు, రాష్ట్ర డ్యాం సేఫ్టీ అధికారులు, విజిలెన్స్ అధికారుల బృందం మేడిగడ్డను పరిశీలించింది.
పియర్స్ కుంగడంపై కారణాలు తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ పనులు డైనోసార్, హట్సన్ ఏజెన్సీలకు అప్పగించింది. అయితే మూడు నెలలుగా ఇన్వెస్టిగేషన్ పనులు మొక్కుబడిగా కొనసాగుతున్నాయి. బరాజ్ వద్ద పనుల్లో ఎలాంటి చొరవ కనిపించడం లేదు. పియర్స్ వద్ద సీరియస్గా పనులు చేపట్టి కారణాలు తెలుసుకునే ప్రక్రియ ఇంతవరకు జరుగడం లేదు. గురువారం బరాజ్ వద్ద పనులు జరుగుతున్న దాఖలాలు కనిపించలేదు. 19, 20, 21వ పియర్స్తోపాటు మిగిలిన పియర్స్ వద్దకు ఇసుకతో రోడ్లు వేశారు. ఏడో బ్లాకు వద్ద ఇసుక కుప్పలు పోశారు.
లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఉన్నాయి. బరాజ్ వద్ద ఎలాంటి ఏజెన్సీల నిపుణులు, సిబ్బంది లేక నిర్మానుష్య వాతావరణం కన్పించింది. బరాజ్ కుంగడంపై కారణాలు తెలుసుకుని నిర్మాణ పనులు ప్రారంభించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదు. విజిలెన్స్ అధికారులతో రోజుకో లీకులు ఇస్తూ కాలయాపన చేస్తూ బరాజ్ పనులను మొత్తానికే పక్కన పెట్టే కుట్ర జరుగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పియర్స్ కుంగడంపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫార్సు చేసేందుకు కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను నీటి పారుదలశాఖ ప్రభుత్వానికి పంపింది. అధ్యయన కమిటీ బరాజ్ వద్ద పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి పియర్స్ కుంగడంపై కారణాలు అన్వేషించి పునరుద్ధరణకు సూచనలు ఇవ్వనుంది. దీంతో మరమ్మతు పనులు వేగవంతమయ్యే అవకాశం ఉన్నది. కాగా ఇంజినీరింగ్ అధికారులు అధ్యయన కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నారు. ఏదిఏమైనా పియర్స్ కుంగడంపై కారణాలు అన్వేషించి త్వరితగతిన పనులు చేపట్టాలని, వర్షాకాలం ప్రారంభమైతే బరాజ్లోకి భారీగా నీరు చేరి తీవ్ర నష్టం జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.