హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా 38 చోట్ల పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆయనపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భారత్ జాగృతి, బీఆర్ఎస్ నాయకులు, కవిత అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి స్థానిక పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఆయా ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ఆయనపై 354-ఏ, 504, 509 ఐపీసీ, 505 ఐపీసీ, సెక్షన్ 67 ఐటీ యాక్టు (2008), 153, 505(2), 354 ఐసీపీ, 294(బీ) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటిలో కొన్ని బెయిలబుల్, మరికొన్ని నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఆయా సెక్షన్ల కింద నేరం నిరూపితమైతే ఏడాది నుంచి మూడేండ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉన్నది.
కేసులు ఎక్కడెక్కడ?
మల్టీ జోన్-1 పరిధిలో మొత్తం 23 చోట్ల బండి సంజయ్పై కేసులు నమోదయ్యాయి. వీటిలో కరీంనగర్లో 8, నిజామాబాద్లో 8, జగిత్యాలలో 3, సిరిసిల్లలో 3, కామారెడ్డిలో ఒక చోట కేసులు నమోదయ్యాయి. మల్టీజోన్-2లోని వికారాబాద్లో 3, మహబూబ్నగర్లో 2, సూర్యాపేటలో 1, నారాయణపేటలో 1, నల్లగొండలో 2 చోట్ల కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో బంజారాహిల్స్ పీఎస్లో ఒక కేసు నమోదైంది. సైబరాబాద్లో కమిషనరేట్ పరిధిలోని కేబీహెచ్పీ, పేట్బషీర్బాద్, మాదాపూర్ పీఎస్లో ఒక్కొక్క కేసు నమోదైంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సైబర్క్రైమ్స్ పీఎస్, వనస్థలిపురం పీఎస్లో రెండు కేసులు నమోదయ్యాయి.
‘నేడు రాలేను.. 18న హాజరవుతా’
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ బుధవారం ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ.. ఈ నెల 13న ఆయనకు మెయిల్ చేసింది. అయితే, పార్లమెంటు సమావేశాల కారణంగా తాను బుధవారం విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 18న కమిషన్కు అనుకూలమైన సమయంలో వ్యక్తిగతంగా హాజరవుతానని ఆయన సమాధానం ఇచ్చారు. విచారణకు సంబంధించిన మెటీరియల్ను తాను హాజరుకాబోయే తేదీకి ముందుగా అందించాలని మహిళా కమిషన్ను అభ్యర్థించారు.