కోరుట్ల రూరల్, సెప్టెంబర్ 13 : అన్న మరణ వార్త విని చెల్లెలు గుండె ఆగిపోయిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. రంగుల పోశాలు(60) బతుకుదెరువు కోసం 20 ఏండ్ల కింద నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామం నుంచి వచ్చి కల్లూరు గ్రామంలో స్థిరపడ్డాడు. కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.
ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామంలో ఉన్న చెల్లెలు రంగు పోచవ్వ(52)కు అన్న మరణ వార్త తెలియడంతో కన్నీటిపర్యంతమైంది. ఏడుస్తూనే, గుండెపోటుతో నేలకొరిగింది. అన్నాచెల్లెళ్ల మృతితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోశాలుకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. పోచవ్వకు భర్త, ఇద్దరు కొడుకులు ఉన్నరు.