హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పూర్తిచేసే లక్ష్యంతో పనులను చేపడుతున్నారు. వర్షాలు మొదలైతే పనుల జరిగే అవకాశం ఉండదని, అంతకు ముందే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజినీర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పట్టణాల్లో మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్లు ఉండేలా పనులు చేస్తున్నారు. ప్రయాణికులకు అవసరమైన ప్రతి రోడ్డు పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దాదాపుగా రూ.1,867 కోట్లతో 1,597 పనులు మంజూరు చేశారు.
రాష్ట్రంలో 25 వేల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఉన్నాయి. వీటిని ప్రతి ఐదేండ్లకోసారి రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. నిరుడు 2,807 కిలోమీటర్లు, ఈ ఏడాది 3,618 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు రెన్యూవల్స్ చేపట్టారు. వీటి కోసం రూ.2,686 కోట్లు వెచ్చిస్తున్నారు. పనుల పర్యవేక్షణకు ఈఎన్సీ, సీఈలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పనుల నాణ్యత, పనులు జరుగుతున్న తీరు, ఇంకా టెండర్లు ఖరారు పనులపై ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పనులపై ఎస్ఈ, ఈఈలతో హైదరాబాద్లో మంత్రి ఎర్రబెల్లి, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు.