నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్లో వచ్చి నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇప్పటికే రెండుసార్లు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచడంతో బడ్జెట్ భారీగా పెరిగిందని, ఫలితంగా రాష్ట్ర ఖజానాకు భారంగా మారిందని, ఇప్పటికైనా పనులు తొందరగా పూర్తి చేయకపోతే మోయలేని భారం పడుతుందని చెప్పారు. అందుకే పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని, ఈ క్రమంలోనే థర్మల్ పవర్ స్టేషన్ను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు స్కిల్డ్, అన్స్కిల్డ్ ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ఆలోచన చేయాలని సూచించారు. పవర్ ప్లాంట్ పురోగతి గురించి మంత్రి భట్టి అధికారులను ప్రశ్నించగా.. ఈ ఏడాది సెప్టెంబర్లో రెండు యూనిట్ల ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని, 2025 మార్చి నాటికి మొత్తం ఐదు యూనిట్ల ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని అందుబాటులోకి తెస్తామని వివరించారు. స్థానికంగా ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాలు, వాటి వడ్డీరేట్ల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ప్రశ్నించారు. సబ్ కాంట్రాక్టులు, ఇతర చిన్న చిన్న పనుల్లో స్థానికులకే అవకాశం కల్పించడం ద్వారా చేయూతనివ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ప్రస్తుతం పవర్ ప్లాంట్లో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను వీడియో ప్రజెంటేషన్ రూపంలో మంత్రుల బృందానికి అధికారులు వివరించారు.
‘నక్కగూడెం ఎత్తిపోతల’కు మంత్రుల శంకుస్థాపన
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెంలో కృష్ణానది పరీవాహంలో నిర్మించిన నక్కగూడెం(రాగ్యానాయక్) ఎత్తిపోతల పథకం పునరుద్ధరణకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 3,200 ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 2012లో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు ఉత్తమ్ తెలిపారు. పులిచింతల బ్యాక్ వాటర్ కింద సుమారు 1.2 కిలోమీటర్ల పొడవున పైప్లైన్ మునిగిపోవడంతో లిఫ్ట్ పునరుద్ధ్దరణ కోసం రూ.37.70 కోట్లు మంజూరు చేయించినట్టు చెప్పారు. దొండపాడు వెళ్తున్న క్రమంలో మంత్రులు మార్గమధ్యంలో కాన్వాయ్ దిగి రోడ్డు వెంట ఉన్న మిర్చి పంటలను పరిశీలించి.. రైతులు, కూలీలతో మాట్లాడారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.