పెద్దపల్లి, జూలై 21 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో ప్రధాన శాఖలకు అధికారులు కరువయ్యారు. జిల్లాలోని అనేక కీలక శాఖలు ఖాళీగానే దర్శనమిస్తుండగా, ఇన్చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పాలన పడకేస్తున్నది. ఉన్నతాధికారులు లేక ఫైళ్లు పేరుకుపోతుండగా, పనుల కోసం కార్యాలయాలకు వచ్చే సామాన్యులకు మాత్రం ‘సార్ లేరు.. రేపు రండి’ అనే సమాధానమే వినిపిస్తున్నది. జిల్లాకు రెండు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు, రెవెన్యూ) పోస్టులు ఉన్నాయి.
అందులో చాలా రోజులుగా ఖాళీగా ఉన్న అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పోస్టులో ఇటీవలే బీ శ్రీరాములు జాయిన్ అయ్యారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జల్ద అరుణశ్రీ ఏడాదిన్నరకాలంగా ఆమె రామగుండం నగర ఇన్చార్జ్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధి ఎక్కువగా ఉండడం, అక్కడ చక్కదిద్దే వ్యవహారాలు కూడా ఎక్కువగా ఉండడంతో దీంతో ఆమె అటే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలోని చాలా పోస్టులు ఖాళీగానే ఉండగా.. ఒక్కొక్కరు రెండేసి శాఖల బాధ్యతలు చూస్తున్నారు.
దీంతో వారు ఏ పోస్టుకు న్యాయం చేయలేకపోతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చినప్పుడు అధికారులు దొరకడం లేదని, ఓ శాఖకు వస్తే మరో శాఖలో ఉంటున్నారని వాపోతున్నారు. శాఖలకు పూర్తి స్థాయి అధికారులు లేక ప్రజా సమస్యలకు సకాలంలో పరిష్కారం దొరకడం లేదని చెబుతున్నారు. కీలకమైన శాఖలకుసైతం ఇన్చార్జిలే ఉండడంతో ఎన్నో సమస్యలు పేరుకుపోతున్నాయని, పాలన గాడితప్పుతున్నదని విమర్శిస్తున్నారు.
రెండు శాఖలకు ఒకరు
డీపీవో వీరబుచ్చయ్య ఉద్యోగ విరమణతో ఆ సీటు ఖాళీ అయింది. దీంతో జడ్పీ సీఈవో నరేందర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. డీటీవో రంగారావు బదిలీ కాగా, ఆయన స్థానంలో ఎంవీఐ రంజిత్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో లైసెన్స్లు, ఆర్సీల కోసం వచ్చే వాహనదారులు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తున్నది.జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ బదిలీపై వెళ్లిపోగా.. డీఆర్డీవో కాళిందిని రెండు శాఖలను చూస్తున్నారు. దీంతో రెండు కీలక శాఖలు కావడంతో పథకాల అమలు, నిధుల విడుదల ఆలస్యమవుతున్నాయి.
వానకాలం సమయంలో డీఎఫ్వో శివయ్య బదిలీ కాగా, ఆ బాధ్యతలను భూపాలపల్లి డీఎఫ్వోకే అప్పగించారు. దీంతో పోడు భూముల సమస్యలు, అటవీ నేరాల పరిషారాలు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లా గనుల శాఖ అధికారి శ్రీనివాస్ హైదరాబాద్కు బదిలీ కాగా, జగిత్యాల డీఎంవోకే రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. దీంతో అక్రమ ఇసుక, మట్టి, మొరం క్వారీలపై తనిఖీలు కరువయ్యాయి.
పశుసంవర్ధక శాఖలోనూ ఇదే దుస్థితి ఉన్నది. ఈ శాఖ పెద్దపల్లి ఏడీ వేణుగోపాల్రావుకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించగా, మంథని, రామగుండం డివిజన్లలో అధికారులే కరువయ్యారు. దీంతో పశుగ్రాసం, టీకాల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. జిల్లా పే అండ్ అకౌంట్స్ అధికారి ప్రభాకర్ కామారెడ్డికి బదిలీ కాగా, కరీంనగర్ నుంచి యాదయ్యకు అదనపు చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో రికార్డులు దుమ్ము పట్టే పరిస్థితి నెలకొన్నది. జీతాల బిల్లులు, పెన్షన్ల ఫైళ్లు అకడే ఆగిపోతున్నాయి. పెద్దపల్లి ఆర్అండ్బీ ఈఈ పోస్టు ఖాళీగా ఉండగా డీఈ భావ్ సింగ్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు ఆయనకు మంచిర్యాల జిల్లా ఇన్చార్జ్ కూడా ఇటీవల ఇవ్వడంతో ఆర్అండ్బీ శాఖలోనూ ఫైళ్లు క్లియరెన్స్ కావడం లేదు. వైద్యం, రెవెన్యూ, విద్యా శాఖల్లోనూ కింది స్థాయి ఉద్యోగుల బదిలీలతో ఖాళీలు ఏర్పడ్డాయి. కొత్త నియామకాలు లేకపోవడంతో కార్యాలయాల్లో ఫైళ్లు దుమ్ము పట్టే పరిస్థితి నెలకొన్నది.