రాయపోల్, జూలై 21: అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్లోని రైతు వేదికలో వివిధ గ్రామాల సర్పంచ్లు, మండల, జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేనివిధంగా రాయపోల్ మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గ్రామాల సర్పంచ్లు విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో విద్యుత్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడారు.
రాయపోల్ మండలంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉండి యూరియా కొరత లేకుండా చూడాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు వచ్చే విధంగా చూడాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. వివిధ కాల్వల నిర్మాణానికి అవసరమైన భూములు సేకరించి రైతులకు పరిహారం చెక్కులు అందజేయాలన్నారు. పనులు తొందరగా ప్రారంభించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గ్రామాల్లో బెల్ట్షాపులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, మండల ప్రత్యేకాధికారి బాబూనాయక్, తహసీల్దార్ కృష్ణమోహన్, డీఎల్పీవో లత, డీఏవో సురేశ్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీఎం యాదగిరి, పీఆర్ ఏఈ రామ్కుమార్, ఐసీడీఎస్ షభానా, మిషన్ భగీరథ ఏఈ అభినయ్, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.