హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మే 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సోమవారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. 17 స్థానాలకుగాను 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని స్థానాల్లో బరిలో ఉండటంతో ఈసారి త్రిముఖ పోటీ నెలకొన్నది. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగగా, మొత్తం 893 నామినేషన్లు వచ్చాయి. వీటిలో కొందరు రెండు సెట్లు, మూడు సెట్ల నామినేషన్లు కూడా సమర్పించారు. 26న నామినేషన్ల పరిశీలన తర్వాత 625 మంది పోటీలో ఉన్నట్టు ఎన్నికల అధికారులు తేల్చారు. గడువు తేదీ సోమవారం వరకు 100 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి చెందిన అభ్యర్థులుసహా మొత్తం 525 మంది అభ్యర్ధులు పోటీలో మిగిలారు. సికింద్రాబాద్ స్థానంలో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వు స్థానంలో అత్యల్పంగా 12 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. సికింద్రాబాద్తోపాటు మెదక్, పెద్దపల్లి, చేవెళ్ల, వరంగల్ (నాలుగు) స్థానాల్లో 40 మందికిపైగా అభ్యర్థులు బరిలో ఉండటం విశేషం. ఆదిలాబాద్తోపాటు జహీరాబాద్, నాగర్కర్నూల్ స్థానాల్లో 20 కన్నా తక్కువ మంది పోటీలో ఉన్నారు. మే 13న పోలింగ్ జరుగనుండగా, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. దాదాపు అన్ని స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరీ తలపడుతున్నారు. అన్ని పార్టీలూ స్థానిక పరిస్థితులు, కుల సమీకరణలు తదితర అంశాలను బేరీజు వేసుకొని అభ్యర్థులను ఎంపికచేసిన విషయం తెలిసిందే.