హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి ఒకసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడవచ్చని పేర్కొన్నది. ఇప్పటికే తెలంగాణలోని అనేక జిల్లాల్లో అకాల వర్షాలు అన్నదాతలకు నష్టాలను తెచ్చిపెట్టాయి. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల మంగళవారం వడగండ్ల పడటంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
రాష్ట్రంలోని కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్, మిగిలిన జిల్లాలకు వాతావరణశాఖ గ్రీన్ అలర్ట్ జారీచేసింది. హైదరాబాద్లో ఇప్పటికే పలుచోట్ల వర్షం కురుస్తున్నది. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్నగర్, కర్మన్ఘాట్లో చిరుజల్లులు పడ్డాయి.
ఏపీలో కూడా వాతావరణం చల్లబడే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అంచనా వేసింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపింది. కిందిస్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం బుధవారం అదే ప్రాంతంలో కొనసాగుతుందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఏపీలోని పలు జిల్లాల్లో అకడకడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి వానలు పడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. మొత్తంగా ఏపీలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.