మామిళ్లగూడెం/పెబ్బేరు, ఏప్రిల్ 26 : పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలియం కొరత ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. శనివారం సాయంత్రం నుంచి పెట్రోల్, డీజిల్ కోసం ఆటోలు, కార్లు, బైకుల యజమానులు బంకుల వద్ద క్యూ కడుతున్నారు. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లపై ఆధారపడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ..ఇరాన్పై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ సరఫరా తగ్గింది. బంక్ యజమానులు బ్లాక్ మార్కెట్లో విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బ్లాక్లో లీటర్ పెట్రోల్ ధర సమారు 300, డీజిల్ ధర 280కి చేరింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని అన్ని బంకుల్లోనూ రెండురోజులుగా నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిమాండ్కు సరిపడా ఇంధనం సరఫరా కాకపోవడంతో యజమానులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు స్టాక్ వస్తున్నప్పటికీ గంటల వ్యవధిలోనే అయిపోతున్నది.
ఆ సమయంలో వాహనదారులు బారులుదీరాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. కొన్నిచోట్ల ఒక్కో వాహనానికి లీటర్ పెట్రోలు మాత్రమే పోస్తున్నారు. ఇక డీజిల్ పరిస్థితి కూడా ఏమి తీసిపోలేదు. పెద్దపెద్ద వాహనదారులు, వ్యవసాయదారులు ముం దుజాగ్రత్తగా క్యాన్ల కొద్దీ పెట్రోల్, డీజిల్ను నిల్వ చేసుకుంటున్నారు. స్టాక్ పాయింట్ నుంచి సగానికి సగం సరఫరా పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తున్నది.