నమస్తే తెలంగాణ నెట్వర్క్: వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేస్తూ తీరని నష్టం మిగులుస్తున్నది. ఊహించని విధంగా ఆది, సోమవారాల్లో కురిసిన వడగండ్ల వాన రైతన్నలకు కడగండ్లు మిగిల్చింది. ఒక వైపు ఇప్పటికే కోసిన ధాన్యం కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో వరుస వర్షాలకు తడిసి ముద్దయింది. రైతులు ధాన్యాన్ని ఎండ వస్తే ఆరబోస్తూ, వాన వస్తే కుప్ప బోస్తూ కన్నీరుపెడుతున్నారు. మరో వైపు పలుచోట్ల వడగండ్ల వానకు చేనుపైనే వడ్లు రాలిపోవడంతో చేతికొచ్చిన పంట నేల పాలైంది. చాలా చోట్ల భారీ వర్షాలు, ఈదురుగాలులకు కోతకొచ్చిన వరి, ఏపుగా ఎదిగిన మక్కజొన్న పంట నేలవాలాయి. కొన్ని చోట్ల వరి పంట నీట మునిగింది. మామిడి కాయలు రాలిపోయాయి.
ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రైతన్న ఆశలపై నీళ్లు నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని రాంపూర్, నవీపేట్, పోతంగల్, మోకన్పల్లి, ఆభంగపట్నం, అబ్బాపూర్ గ్రామాల్లో కల్లాల్లోనే ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల ధాన్యం మొలకెత్తింది. పలుచోట్ల తూకం వేసిన ధాన్యం బస్తాలు సైతం తడిసిపోయాయి. బోధన్, సాలూర మండలాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నెలవాలడమే కాకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం, కొయ్యగుట్ట, తిమ్మాపూర్, కొత్తబాది, బుడ్మి గ్రామాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది. తడిసిన ధాన్యం ఆరబెట్టగా మొలకలు వచ్చాయి. కరీంనగర్ మండలం గోపాల్పూర్లో పది ఎకరాలకుపైగా వాటర్ మిలన్ పంట దెబ్బతిన్నది. దాదాపు అన్ని గ్రామాల్లో వరి పైరు నేలవాలి గింజలు రాలడంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. పెద్దపల్లి జిల్లాలో 5,290 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు జిల్లా అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో 3.70 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం, ప్రభుత్వం కాంటా చేసిన 480 టన్నుల ధాన్యం తడిసి ముద్దయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో 13,200 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు గుర్తించారు.
జగిత్యాల జిల్లాలో మళ్లీ వాన బీభత్సం సృష్టించింది. గొల్లపల్లి, జగిత్యాల రూరల్, వెల్గటూర్, బుగ్గారం, ఇబ్రహీంపట్నం, కొడిమ్యాల మండలాల్లో వరి, మక్క, నువ్వు పంటలకు నష్టం జరిగింది. దాదాపు 59,794.04 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ, ఉద్యానవన అధికారులు అంచనాలు వేశారు. 32,444 మంది రైతులు నష్టపోయారని అధికారులు ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలో సుమారు 300 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు రైతులు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 4,868 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జనగామ జిల్లాలో 749 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఖమ్మం జిల్లాలో 967 ఎకరాల్లో పంటలు నేలవాలాయి. భద్రాద్రి జిల్లాలో 80 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం నుంచి కురిసిన భారీ వర్షానికి చాలా చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. నాలాలు పొంగిపొర్లాయి. షేక్పేటలో అత్యధికంగా 10.6 సెం.మీ., వెంగళరావునగర్లో 8.2 సెం.మీ వర్షం పడినట్టు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
అకాల వర్షాలతో విద్యుత్తు శాఖకు సంభవించిన నష్టంపై సచివాలయంలో మంత్రి జగదీశ్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు అధికంగా కురిసే అవకాశముండగా, విద్యుత్తు శాఖ ఇంజినీర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈదురు గాలులతో చెట్లు విరిగి స్తంభాలపై పడటంతో, వైర్లు తెగిపడటం వంటి వాటిపై క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రధానంగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. సమీక్షలో ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ సునీల్శర్మ, ట్రాన్స్కో, జెనో సీఎండీ ప్రభాకర్రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.