హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మీపై రూ.లక్ష అప్పు ఉంది. ఆశ్చర్యపోతున్నారా? ఎవరికీ బకాయి పడకుండానే అప్పు ఉండడమేంటని అనుకొంటున్నారా? అవును.. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ.147.19 లక్షల కోట్ల అప్పులు చేసింది మరి. అంటే, దేశ జనాభా 140 కోట్లుగా తీసుకొంటే, సెకనుకు ముందు పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరిపై రమారమీ లక్ష రూపాయల అప్పు ఉన్నట్టు. ఈ లెక్క చెప్పింది.. కేంద్ర ఆర్థికశాఖ నివేదికే.
కేంద్రంలోని బీజేపీ సర్కారు వల్ల భారత్ రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని మరోసారి రుజువైంది. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. కేంద్రం ఇప్పటివరకు రూ.147.19 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఈ ఏడాది జూన్ నాటికి దేశం మొత్తం అప్పు రూ. 145.72 లక్షల కోట్లు ఉండగా, గత రెండు నెలల వ్యవధిలోనే బీజేపీ ప్రభుత్వం రూ.1.47 లక్షల కోట్ల అప్పు చేసింది. దీంతో సెప్టెంబర్ చివరి నాటికి అది రూ.147.19 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో 29.6 శాతం దీర్ఘకాలిక రుణాలు ఉన్నాయి.
నెలకు సగటున 90 వేల కోట్ల అప్పు
గత 67 ఏండ్లలో కేంద్రం చేసిన అప్పు రూ.55,87,147 కోట్లు కాగా, మోదీ ప్రధాని అయిన తర్వాత ఎనిమిదన్నరేండ్లలో చేసిన అప్పు రూ.91 లక్షల కోట్లకు పైగా ఉన్నది. అప్పటి ప్రధానులు ఏడాదికి సగటున రూ.83 వేల కోట్ల అప్పులు చేస్తే, మోదీ ఏకంగా నెలకే దాదాపు రూ.90 వేల కోట్ల అప్పులు చేశారు. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ, దొడ్డిదారిన పన్నులు వసూలు చేస్తూ బీజేపీ ప్రభుత్వం సామాన్యుల ఉసురు తీస్తున్నది. పేద, మధ్యతరగతి వర్గాలకు ఇస్తున్న సబ్సిడీలు తగ్గించి, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై వాత పెడుతున్నది.
తగ్గుతున్న మారక నిల్వలు
2021 సెప్టెంబర్ 21 నాటికి 638.64 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న విదేశీమారకపు నిల్వలు, 2022, సెప్టెంబర్ 30 నాటికి 532.66 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. అంతేకాకుండా అమెరిన్ డాలరుతో రూపాయి మారకం విలువ కూడా పడిపోతున్నది.