కరీంనగర్ : నగరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి 6వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహణకు ముహూర్తం ఖరారు అయ్యింది. మంగళవారం నగరంలోని టవర్ సర్కిల్ ప్రధాన మార్కెట్ పురాతన వేంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి వివరాలు వెల్లడించారు.
జనవరి 23 నుంచి నాలుగు రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాల అధ్యాయనోత్సవాలు జరుగుతాయని, జనవరి 27 నుంచి ఫిబ్రవరి 01 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఫిబ్రవరి 2 న ఎన్నడూ ఎరగని రీతిలో శోభాయాత్ర జరుపుతామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు నిత్యాన్నదానంతో పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.
శ్రీవారి కల్యాణం సందర్భంగా కల్యాణానికి హాజరైన భక్తులకు అమ్మవారి పసుపు, కుంకుమ అక్షింతలతో పాటు 10వేల లడ్డు ప్రసాదాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వందఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించగలగడం తమ అదృష్టమని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, నాయకులు చల్లా హరిశంకర్, నందలి మహిపాల్, గంప రమేష్, గోగుల ప్రసాద్, ఆలయ ఈవో, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.