Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి దడపుట్టిస్తున్నయి. వచ్చేది అసలే మే నెల!. ఎండలు ఎట్లుంటయో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతున్నది. ఈ తరుణంలో ఎండలు మండే మే నెల మధ్యలో జరిగే లోక్సభ పోలింగ్ కోసం ప్రజలకు వెసులుబాటు ఇవ్వాల్సింది పోయి, తెలంగాణపై కేంద్ర ఎన్నికల సంఘం వివక్ష చూపుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈశాన్య రాష్ర్టాలు మినహా అన్ని రాష్ర్టాల్లో సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ సమయం ఇవ్వగా, తెలంగాణలో మాత్రం మే 13న సాయంత్రం 5 గంటల వరకే సమయమిచ్చింది. మిట్టమధ్యాహ్నం పోలింగ్ మందకొడిగా ఉంటుందని, సాయంత్రం సమయం కేటాయిస్తేనే ఓటర్లు కేంద్రాలకు వస్తారని, ఈసీ నిర్ణయంతో రాష్ట్రంలో ఓటింగ్ శాతం తగ్గే ప్రమాదముందని అటు రాజకీయ పార్టీలు, ఇటు అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. అన్ని రాష్ర్టాల మాదిరిగా ఇక్కడా సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నది.
ఇప్పటికే రెడ్ అలర్ట్
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని స్పష్టంగా చెబుతున్నది. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నం వరకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఏప్రిల్లోనే ఇంత తీవ్రత ఉంటే మేలో ఎలా ఉంటుందోననే ఆందోళన రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో నెలకొన్నది. ఉదయం ప్రచారానికి ప్రజలు ముందుకురాకపోవడం వల్లే సాయంత్రం వేళ నిర్వహిస్తున్నామని, ఇక పగలు జరిగే పోలింగ్కు ఓటర్లు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓటర్లకు సహకరించి పోలింగ్ శాతాన్ని పెంచాల్సిన ఎన్నికల సంఘం, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తెలంగాణపై వివక్షేనని ఆరోపిస్తున్నారు.
అసలే పట్టణవాసులు!
తెలంగాణలో పట్టణ ప్రాంతాలు ఎక్కువ. ఇక్కడి పట్టణవాసులు ఓటేసేందుకు ముందుకురారనే అపవాదు కూడా ఉంది. ఇక మిట్ట మధ్యాహ్నం పట్టణాల్లో పోలింగ్ సరళి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. దేశంలో 2019లో 50 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైన పార్లమెంట్ నియోజకవర్గాలు చూస్తే మన రాష్ట్రం నుంచే నాలుగు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ఉన్నాయి.
ఇక్కడా సమయం పెంచాల్సిందే
సాయంత్రం 5 గంటలు దాటితేగాని, కొంత ఎండ తీవ్రత తగ్గడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 5 గంటల వరకే సమయం ఇస్తే ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి చూపరని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సిన వారు అసలే ముందుకురారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఈసీ పునఃసమీక్షించుకొని మిగతా రాష్ర్టాల్లానే తెలంగాణలోనూ ఆరు గంటల వరకు ఓటేసేందుకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
నక్సల్స్ ప్రభావమున్న ఛత్తీస్గఢ్లోనూ సాయంత్రం 6 వరకు
దేశంలో ప్రస్తుతం నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ గుర్తింపు పొందింది. అలాంటి ప్రాంతంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్కు సమయం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనూ 6 గంటల వరకు అనుమతినిచ్చారు. తెలంగాణ చుట్టు పక్కల అన్ని రాష్ర్టాల్లోనూ 6 గంటల వరకు సమయాన్నిచ్చి తెలంగాణలో 5 గంటలకే ముగించాలనడంపై పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి.