హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలోని నీటి వినియోగానికి సంబంధించి కేఆర్ఎంబీ గురువారం తలపెట్టిన త్రీమెన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ సర్కారు కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్కు ఏపీ బుధవారం లేఖను రాసింది. ఏప్రిల్ కోటాకు సాగర్ నుంచి 5 టీఎంసీలను విడుదల చేయాలని, బోర్డు నుంచి అధికారులను కేటాయించాలని కోరుతూ ఇటీవలే కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీంతో ఉమ్మడి రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, భవిష్యత్ తాగునీటి అవసరాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు త్రిమెన్ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించాలని నిర్ణయించి ఇరు రాష్ర్టాలకు లేఖ రాసింది. ఆ సమావేశాన్ని 8కి వాయిదా వేయాలని కోరింది. తెలంగాణ సైతం వాయిదా వేయాలని కోరినట్టు సమాచారం.
తెలంగాణను నిలువరించండి..
నాగార్జున సాగర్ నుంచి నీటిని వినియోగించుకోకుండా తెలంగాణ రాష్ర్టాన్ని వెంటనే నిలువరించాలని డిమాండ్ చేస్తూ బోర్డుకు ఏపీ సర్కారు మరో లేఖను రాసింది. తెలంగాణ ఇప్పటికే కోటా మించి జలాలను వినియోగించుకున్నదని ఆక్షేపించింది. ఇటీవల మళ్లీ అదనంగా నీటిని విడుదల ప్రారంభించిందని పేర్కొన్నది.