హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): గురుకుల, ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు సంబంధించి వెల్కమ్ కిట్లు, తదితర వాటికోసం నిర్వహించిన టెండర్లు నెల దాటుతున్నా కొలిక్కిరాలేదు. ఆయా విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఏటా పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు మొత్తంగా 24 రకాల వస్తువులను ప్రభుత్వమే అందిస్తున్నది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 9 ఐటమ్స్కు టెండర్ల బిడ్ల దాఖలు గడువు ఏప్రిల్ 17వ తేదీతో ముగిసింది. 28 ఏజెన్సీలు బిడ్లను దాఖలు చేయగా, అందులో 14 ఏజెన్సీలు క్వాలిఫై అయ్యాయని నిర్ధారించారు.
ఇక అందులో ప్రధానంగా గుజరాత్ కంపెనీలకే టెండర్లను కట్టబెట్టేందుకు ప్రభుత్వపెద్దలు ముందస్తుగానే లోపాయికారీగా ఒప్పందాలు చేసుకున్నారని, ఆ మేరకు ఏజెన్సీలను సైతం ఖరారు చేసినట్టు అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా మే మొదటి వారంలోనే వర్క్ అగ్రిమెంట్లు కూడా పూర్తి చేయాలని సర్కార్ భావించింది. కానీ ఇప్పటికీ టెండర్ల ప్రక్రియే కొలిక్కి రాలేదు. వీటిలో ఏ ఒక్కటి కూడా అర్హత సాధించలేదని రీటెండర్లు నిర్వహించాలని భావిస్తున్నట్టు అధికారవర్గాలు తెలుపుతున్నాయి.