పదేండ్లలో ప్రపంచాన్ని అబ్బురపర్చిన తెలంగాణ పథకాలు.. కాంగ్రెస్ బడ్జెట్లో నివ్వెరపోయాయి. శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘ఓట్ఆన్ అకౌంట్’ బడ్జెట్.. గ్యారెంటీల అమలుపై ప్రభుత్వ చిత్తశుద్ధిని తేటతెల్లంచేసింది. డిక్లరేషన్లూ డీలా పడ్డాయి. పాత, ప్రఖ్యాత పథకాలకు కేటాయింపులు రద్దు చేయడం, అద్భుతాలంటూ ఊదరగొట్టిన ఆరు గ్యారెంటీలకు అత్తెసరు నిధులు కేటాయించడం గమనార్హం. సాగు ప్రధానమైన తెలంగాణలో వ్యవసాయ కేటాయింపులు బలహీనంగా ఉన్నాయి. మొత్తం 83వేల కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం 19వేల కోట్లకే సరిపెట్టింది.
Telangana Budget | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ ఎన్నికల వేళ, ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పదే పదే ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే, ఆచరణలోకి వచ్చేసరికి ప్రభుత్వం మాట నిలుపుకోలేకపోయింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా ఆరు గ్యారెంటీల అమలుకు రూ.53 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, వేసిన అంచనాలకు, కేటాయింపులకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అని చెప్తున్నా.. అందులోని అంశాలు కలిపితే మొత్తం దాదాపు 16 హామీలు ఇచ్చింది. ఇందులో రెండు అంశాలు మినహా మిగతా 14 ఆర్థికంగా ముడిపడి ఉన్నవే. వీటిని అమలు చేయాలంటే ఏటా సుమారు రూ.1.70 లక్షల కోట్ల మేర అవసరం అవుతాయని గతంలో ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ప్రభుత్వం మాత్రం రూ.53 వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నది. అంటే డిమాండ్లో 31 శాతం మాత్రమే ప్రతిపాదించింది.
ఒకవేళ అన్ని అంశాలు కాకుండా దశలవారీగా అమలు చేయాలని ప్రభుత్వం భావించినా.. ఈ ఆర్థిక సంవత్సరంలో కచ్చితంగా అమలు చేయాల్సిన హామీలకే సుమారు రూ.82 వేల కోట్లు అవసరమని నిపుణులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుండగా, రూ.500కే సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను బడ్జెట్లో ప్రకటించింది. రైతులకు రూ.15 వేల పెట్టబడి సాయం, రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు, పంట బోనస్, ఆసరా పెన్షన్లు 4 వేలకు పెంపు వంటివి తప్పనిసరిగా ఈ ఏడాదే అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి అమలుకు సుమారు రూ.82 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా. అంటే దాదాపు రూ.30వేల కోట్ల మేర కేటాయింపులను తగ్గించింది.
‘రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందజేసేందుకు మంత్రివర్గంలో నిర్ణయించాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిస్తాం’ అని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చేసరికి మాత్రం అర్హులైన కుటుంబాలకు మాత్రమేనంటూ మెలికపెట్టింది. మ్యానిఫెస్టోలో ఒకలా ప్రకటించిన ఓట్లు దండుకొని.. తీరా బడ్జెట్కు వచ్చేసరికి అర్హులైన లబ్ధిదారులకు వర్తింపజేస్తామంటూ ప్రజలను మోసపుచ్చింది. రాష్ట్రంలో 90 లక్షల గృహాలుండగా.. ఏటా గృహజ్యోతి పథకాన్ని అమలు చేయాలంటే రూ.8 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వ వర్గాలు తేల్చాయి. కానీ తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం ఇందుకోసం రూ. 2,400 కోట్లను మాత్రమే కేటాయించింది. అంటే 30శాతం నిధులను మాత్రమే బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈ లెక్కన గృహజ్యోతి అమలుపై ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో వారి ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో ఆటో డ్రైవర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 12వేల చొప్పున సహాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఆ మేరకు బడ్జెట్లో నిధుల కేటాయించలేదు. ఆటో డ్రైవర్ల సాయంపై అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే.. వారికి తప్పకుండా సాయం చేసే బాధ్యత తమదేనని చెప్పిన కాంగ్రెస్ సర్కారు బడ్జెట్లో మాత్రం వారికి మొండి‘చెయ్యి’ చూపింది.