CM Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాబోయే 3 నెలల కాలానికి ఆర్బీఐ నుంచి రూ.13 వేల కోట్ల అప్పు తీసుకోవాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకోనున్న రుణాల వివరాల నివేదికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం 3 నెలల కాలానికి రూ.13 వేల కోట్ల రుణం తీసుకోనున్నది. జనవరి 9న రూ.1,000 కోట్లు, 16న రూ.2,000 కోట్లు, 30న రూ.1,000 కోట్లు మొత్తంగా జనవరిలో రూ.4,000 కోట్లను తీసుకోనున్నది.
ఫిబ్రవరిలో మొత్తంగా రూ.3,000 కోట్ల రుణం తీసుకోనుండగా, అందులో 13, 20, 27 తేదీల్లో రూ.1,000 కోట్ల చొప్పున తీసుకోనున్నది. మార్చి నెలకు గానూ 5న రూ.2,000 కోట్లు, 12న రూ.1,000 కోట్లు, 19న రూ.2,000 కోట్లు, 26న రూ.1,000 కోట్లు మొత్తంగా 4 విడతల్లో రూ.6 వేల కోట్లు అప్పు తీసుకోనున్నది. మొత్తంగా 10 విడతల్లో రూ.13 వేల కోట్ల అప్పు చేయనున్నది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, యూటీలు కలిపి వచ్చే త్రైమాసికంలో రూ.4,13,452 కోట్ల రుణాలు తీసుకోనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐ నుంచి రూ.1,400 కోట్ల రుణం తీసుకున్నది. కొత్త ప్రభుత్వం డిసెంబర్ 7న ఏర్పడగా, 5 రోజుల అనంతరమే (డిసెంబర్ 12న) ఆర్బీఐ వద్ద రూ.500 కోట్ల అప్పు చేసింది. అనంతరం డిసెంబర్ 19న మరోసారి రూ.900 కోట్లు రుణంగా తీసుకున్నది. మొత్తంగా ఒక్క నెలలో రూ.1,400 కోట్ల అప్పు తీసుకున్నది. తాజాగా వచ్చే త్రైమాసికానికి మరో రూ.13 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించడం గమనార్హం.