FCI | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కేంద్రం కొర్రీలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) సతాయింపులతో మిల్లుల్లో పేరుకుపోయిన మిగులు ధాన్యాన్ని విక్రయించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. 2022-23 వానకాలం, యాసంగిలో మిగిలిన ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయం తీసుకొన్నది. ధర నిర్ణయించడంతోపాటు వేలానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ ధాన్యం వేలం వేసేందుకు విధి విధానాలను రూపొందించడంతో పాటు రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచడంపై, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు స్థలం గుర్తింపు, పరిశ్రమలకు రాయితీలు, అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టగల వ్యాపారులను గుర్తించడం వంటి అంశాలపైనా కమిటీ కసరత్తు చేయనున్నది. ఈ కమిటీకి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తుండగా.. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఎం కార్యదర్శి, టీఎస్ఐఐసీ ఎండీ, సివిల్సైప్లె కమిషనర్ సభ్యులుగా ఉండనున్నారు. పౌరసరఫరాల సంస్థ సమస్యలపై ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కమిటీని నియమించింది.
కేంద్రం కొర్రీలు… మిల్లుల్లో గుట్టలుగా ధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం నుంచి తీసిన బియ్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నది. బాయిల్డ్ రైస్ తీసుకోబోమని, కేవలం రా రైస్, ఫోర్టిఫైడ్ రైస్ మాత్రమే కావాలంటూ కండిషన్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్న ఎఫ్సీఐ వేధింపులు ఇందుకు తోడయ్యాయి. 2022-23 వానకాలం సీజన్లో రాష్ట్ర సర్కారు రూ.13,750 కోట్లు రైతులకు ఇచ్చి 64.30 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. యాసంగిలో రూ.13,838 కోట్లు వెచ్చించి 65.82 కోట్ల ధాన్యం సేకరించింది. ఒక్క ఏడాదిలోనే 1.30 కోట్ల టన్నుల ధాన్యం సేకరించగా, కొంతమాత్రమే ఎఫ్సీఐ తీసుకోగా ఇంకా 1.10 కోట్ల టన్నుల ధాన్యం మిల్లుల్లోనూ మూలుగుతున్నది. మరో మూడు నెలల్లో వానకాలం సీజన్ ధాన్యం రావడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితుల్లో ధాన్యం వేలం వేసి విక్రయించడం వల్లే పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలంగాణ సర్కారు భావించింది.
1.మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు..
2. మిగులు ధాన్యం వేలం వేసేందుకు