హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఓటరు నమోదు, ఓటింగ్ శాతం పెరుగుదలపై రాష్ట్రంలో 800 కిలోమీటర్ల మేర నిర్వహించిన సైకిల్ ర్యాలీతో అనుకున్న లక్ష్యం నెరవేరిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కమిషనర్ రోనాల్డ్ రోస్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ సైకిల్ ర్యాలీ బృందంతో సమావేశమయ్యారు.
ఈ నెల 4న దుర్గం చెరువు వద్ద ఓటరు అవగాహనపై రాష్ట్ర వ్యాప్త సైకిల్ ర్యాలీని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఆఫీసర్ రాజీవ్కుమార్ ప్రారంభించినట్టు చెప్పారు. యువ ఓటర్లకు అవగాహన కల్పించేందుకు పలు కాలేజీలను సందర్శించి ఓటరు నమోదు, ఓటింగ్పై పూర్తి అవగాహన కల్పించినట్టు వివరించారు. హైదరాబాద్ సహా జనగాం, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ సైకిల్ ర్యాలీ దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతినిధులను సన్మానించారు. సైక్లింగ్ రాష్ట్ర స్థాయిలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన సీఈవోకు వైమానిక రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ మోహన్ అభినందనలు తెలిపారు.