Vote for Note Case | హైదరాబాద్, ఏప్రిల్18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీం కోర్టు జూలై 24కు వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో గురువారం కేసు విచారణకు రాగా, తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేయాలని కోరింది. ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదాలు ఇచ్చేదిలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ జూలై 24కు విచారణను వాయిదా వేసింది. విచారణ అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, రేవంత్రెడ్డి కుమ్మకయ్యారని మండిపడ్డారు.
‘ఒక ఓటుకు ఐదు కోట్లు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడింది. రూ. 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్రెడ్డి. ప్రపంచమంతా చూస్తుండగానే డబ్బు ఇచ్చారు. అన్ని సాక్ష్యాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే. ఏడేండ్ల నుంచి కేసును రకరకాల కారణాలతో సాగదీస్తున్నారు. సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు’ అని ఎమ్మెల్యే ఆరే చెప్పారు.