హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కోసం ఇబ్బంది ఉండదని, ఆదివారం నుంచి చమురు సరఫరాను 126 శాతం పెంచామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద ఊహించని రద్దీ పెరుగడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని అన్నారు.
పరిశ్రమలకు వాడే డీజిల్ ధరను ఇటీవల లీటరుకు రూ. 150కు పెంచడంతో పెద్ద మొత్తంలో డీజిల్ కొనే వ్యాపారులు లీటరు రూ.95కే దొరుకుతున్న సాధారణ పబ్లిక్ పెట్రోల్ బంకులకు వచ్చి కొంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో సరఫరా సమస్యలు ఉండటంతో అక్కడి వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం ఖమ్మం, నిర్మల్, తెలంగాణ సరిహద్దు జిల్లాలకు క్యూ కడుతున్నట్లు తెలిపారు.
ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే తప్పుడు పుకార్లతో ప్రజలు భయపడి, అవసరానికి మించి కొని దాచుకుంటున్నట్లు వెల్లడించారు. సమస్యను పరిషరించడానికి మారెట్లో సరిపడా నిల్వలు ఉంచాలని కంపెనీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసినట్లు రవీంద్ర వివరించారు. రాజధానిలో కొరత రాకుండా చూడటానికి సరఫరాను 43శాతం మేర పెంచినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని పౌర సరఫరాల శాఖ ప్రజలకు హామీ ఇస్తున్నదని తెలిపారు. ప్రజలు ఎలాంటి పుకార్లు నమ్మవద్దని, అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.