యాదాద్రి: యాదగిరి శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈనెల 2 నుంచి ఆలయంలో నిర్వహించిన అధ్యయనోత్సవాలు శనివారం ముగిశాయి. చివరి రోజు స్వామివారిని అందంగా అలంకరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అళ్వారులు ప్రబంధ పారాయణం చేస్తూ స్వామివారిని ఆలయంలో ఊరేగించారు.
అనంతరం ఉత్సవమూర్తులకు తిరుమంజన, నవకలశస్నపనను ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, వేదపండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. అధ్యయనోత్సవంలో పాల్గొన్న వారిని ఆలయ అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఆలయ ఈవో గీత తదితరులు పాల్గొన్నారు.