Congress | వరంగల్, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. రాజకీయాలు, పాలనా విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. పైచేయి సాధించేందుకు ఇద్దరూ పోటాపోటీ వ్యూహాలను అమలు చేస్తున్నారు. గతంలో మేడారం జాతర సమయంలో వీరి మధ్య మొదలైన పంచాయితీ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ఇన్చార్జి మార్పు విషయంలో తీవ్రస్థాయికి చేరింది.
వరంగల్లోని ధార్మిక భవన్ వినియోగంపైనా ఇద్దరి మధ్య పోరు మరింత ముదిరింది. ఇప్పుడు ధార్మిక భవన్ను వేరే వాటి కోసం వినియోగించే ఆలోచన చేయడం సరికాదని సీతక్క వర్గీయులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ ఈవో కార్యాలయం ధార్మిక భవన్లో అన్ని వసతులతో ఉన్నదని, ఈ ఆఫీసును అక్కడి నుంచి తొలగించే ప్రతిపాదన సరికాదని పేర్కొంటున్నారు. ధార్మిక భవన్లో సమ్కక్క-సారలమ్మ ఈవో ఆఫీసును కొనసాగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు మేడారంలో పూజలు నిలిపివేస్తామని అక్కడి పూజారులు వారం క్రితం ప్రకటించారు. మంత్రి సీతక్క ప్రోద్బలంతోనే ఈ ప్రకటనలు వచ్చాయని కొండా సురేఖ వర్గీయులు మండిపడుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతర విషయంలోనూ ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు పొడచూపాయి. జాతర జరిగే ప్రాంతం సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో ఉండగా, ఈ జాతర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరగాలి. జాతరలో కీలకంగా వ్యవహరించాలని కొండా సురేఖ ఒకటి రెండు సమీక్షలకు వెళ్లారు. పనుల ప్రతిపాదన, వాటిని పూర్తి చేయడం, జాతర నిర్వహణలో ఏర్పాట్లపై ఇద్దరి నడుమ విభేదాలు నెలకొన్నాయి. దీంతోజాతరకు నెల ముందు నుంచే కొండా సురేఖ అటువైపు వెళ్లనేలేదు. సీఎం రేవంత్రెడ్డి జాతరకు వచ్చిన రోజే అక్కడకు వచ్చి వెళ్లారు.
జాతర నిర్వహణ, పనుల పర్యవేక్షణ అంతా సీతక్కే చూసుకున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ సెగ్మెంట్ ఇన్చార్జిగా ఉన్న కొండా సురేఖను బాధ్యతల నుంచి తప్పించి మెదక్ నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ ప్రకటించింది. సీతక్క సూచనలతోనే సొంత సెగ్మెంట్ నుంచి కొండా సురేఖను దూరం పెట్టారని ఆమె వర్గీయులు ఆనాడే అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన మేయర్ గుండు సుధారాణిని తనకు సమాచారం లేకుండా సీతక్క ప్రమేయంతోనే కాంగ్రెస్లో చేర్చుకున్నారని సురేఖ అసంతృప్తితో ఉన్నారు. దీంతో మంత్రులు సురేఖ, సీతక్క ఆధిపత్య పోరుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటు పాలనా యంత్రాంగం, ఇటు కాంగ్రెస్ శ్రేణులు సతమతం అవుతుండటం బహిరంగ రహస్యం.