హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. హరితహారం, అటవీ పునరుద్ధరణ, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం, పచ్చదనం పెరిగేందుకు ఎంతగానో దోహదపడ్డాయి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. పార్లమెంటులో సభ్యులు అడిగి ప్రశ్నకు సమాధానంగా హరిత తెలంగాణ పురోగతిని కేంద్రం వివరించింది.
2015లో తెలంగాణలో గ్రీన్కవర్ 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2021నాటికి అది 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయాన్ని కేంద్రం వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్-2021 ప్రకారం దేశ భౌగోళిక ప్రాంతంలో 21.71శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. 2019నాటి నివేదికతో పోల్చిచూస్తే.. 2,261 చదరపు కిలోమీటర్లు అదనంగా పెరిగి మొత్తం దేశ అటవీ విస్తీర్ణం 7,13,789 చదరపు కిలోమీటర్లకు చేరింది. కాగా, తెలంగాణలో 2015లో 19,854 చదరపు కిలోమీటర్లుగా ఉన్న అటవీ విస్తీర్ణం 2021 నాటికి 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దీంతోపాటు రాష్ట్రంలో గ్రీన్కవర్ 18 నుంచి 31.6 శాతానికి పెరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి లోక్సభలో వెల్లడించారు.
హైదరాబాద్ గత దశాబ్దంలో అభివృద్ధి చేసిన గ్రీన్కవర్లో అన్ని మెగాసిటీల జాబితాలో అగ్రస్థానంలో ఉందని కేంద్రం తెలిపింది. నగరంలో పచ్చదనం 33.15 చ.కిలోమీటర్ల నుండి 81.81 చ.కిలోమీటర్లు పెరిగిందని వెల్లడించింది. అంటే 246 శాతం గ్రీన్కవర్ పెరిగింది. హెచ్ఎండీఏ పరిధిలో 129 ప్రదేశాలలో 188 ఫారెస్ట్ బ్లాకులు అభివృద్ధి చేశారని, మొత్తం 1.6 లక్షల ఎకరాల భూమిని పునరుజ్జీవింపజేశారని వెల్లడించింది.