Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో పదిహేను రోడ్లను జాతీయ రహదారులు (ఎన్హెచ్)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021-22, 2022-23 వార్షిక ప్రణాళికలో భాగంగా రూ.7,937 కోట్లతో 722 కిలోమీటర్ల పొడవున ఎన్హెచ్ ప్రమాణాల మేరకు డబుల్ లేన్ల రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. పది రోడ్లకు (550 కిలోమీటర్లు) ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, మిగిలిన 172 కిలోమీటర్ల పొడవుగల ఐదు రోడ్లకు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేది.
జాతీయ రహదారులు చాలా తకువగా ఉండేవి. రోడ్లు గుంతలు పడి, రాకపోకలకు ఇబ్బందికరంగా ఉండేవి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కారు రహదారుల పరిస్థితిని మెరుగుపర్చడం ద్వారా ప్రగతిబాటలు నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రధాన రోడ్లను దశలవారీగా అత్యున్నత ప్రమాణాలతో జాతీయ రహదారులుగా అభివృద్ధి చేస్తున్నది. 2021-22 వార్షిక ప్రణాళికలో పది రోడ్లను ప్రతిపాదించారు. రూ.5,977 కోట్లతో పది రోడ్లను, 2022-23 వార్షిక ప్రణాళికలో భాగంగా మెదక్-ఎల్లారెడ్డి, ఎల్లారెడ్డి-రుద్రూర్, ఖమ్మం-కురవి, ఆదిలాబాద్-బేలా తదితర సెక్షన్లలోని నాలుగు రోడ్లతోపాటు మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో ఆరు కిలోమీటర్లమేర రోడ్డును డబుల్ లేన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2021-22 వార్షిక ప్రణాళికలో మంజూరైన రహదారులకు టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, రేపో మాపో పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2022-23 వార్షిక ప్రణాళికలోని రోడ్లకు డీపీఆర్ల రూపకల్పన, సాంకేతికపరమైన మంజూరీలు తదితర ప్రక్రియ పూర్తికావడంతో త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేయనున్నారు.