హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, చర్యల వల్ల స్వచ్ఛతలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ విభాగంలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ర్టానికి ఎన్ని అవార్డులు వచ్చాయన్న విషయాన్ని కేంద్రం శనివారం అధికారికంగా వెల్లడించింది. మహారాష్ట్ర (19 అవార్డులు), తెలంగాణ (16 అవార్డులు), అస్సాం (14), ఉత్తరప్రదేశ్ (12), మధ్యప్రదేశ్ (12), ఒడిశా (11), పంజాబ్ (11), ఛత్తీస్గఢ్(10), ఆంధ్రప్రదేశ్ (7), కర్ణాటక (4), గుజరాత్(4), ఉత్తరాఖండ్ (4) లభించాయి.
మహారాష్ట్రలో 28 కార్పొరేషన్లు, 226 మున్సిపాలిటీలు ఉండగా అవార్డులు దక్కింది కేవలం 19 పట్టణాలకే. తెలంగాణలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి 142 ఉండగా, 16 పట్టణాలకు అవార్డులు రావడం విశేషం. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తక్కువ సంఖ్యలో అవార్డులు గెలుచుకున్నాయి. గుజరాత్ మాడల్ అంటూ ప్రచారం చేసుకునే ఆ రాష్ట్రంలో నాలుగు పట్టణాలకే అవార్డులు రాగా, అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు 12 దక్కడం గమనార్హం. పెద్ద రాష్ర్టాలతో పోటీపడి తెలంగాణ అధిక సంఖ్యలో అవార్డులు సాధించింది. తన పనితీరుతో దేశాన్ని విస్మయపరిచింది.