హైదరాబాద్/నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కొనసాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. లీకేజీ అయిన పరీక్షల రద్దు, మిగతా పరీక్షలను వాయిదా వేయడాన్ని సమర్థించింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యహారంపై దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీ విజయ్సేన్ రెడ్డి సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. టీఎస్పీఎస్సీ పరీక్షల లీకేజీపై సిట్ గతంలో ఇచ్చిన నివేదికతోపాటు సోమవారం తాజాగా సమర్పించిన అనుబంధ నివేదికను పరిశీలించారు. వీటిపై ఈ నెల 28న జరిగే విచారణలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. సిట్లో సభ్యులపై ఆరా తీశారు. సిట్ దర్యాప్తు, పోలీసుల పనితీరును శంకించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. సిట్ బృందంలోని సభ్యుల నైపుణ్యం గురించి సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లల్లో ఒకరితో నివేదిక తెప్పించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఇకపై లీకేజీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ ఒక కంప్యూటర్ను మాత్రమే సీజ్ చేసిందని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వివేక్ ఠంకా వాదించారు. సిట్ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. ఈ వాదనను అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు. సిట్ దర్యాప్తు బృందం 12 కంప్యూటర్లను సీజ్ చేసిందని స్పష్టం చేశారు. వాటిని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)కి పంపామని, నివేదిక రావాల్సి ఉందని వెల్లడించారు. సీసీఎస్కు అనుబంధంగా కీలక కేసులను దర్యాప్తు చేసే సిట్లో సాంకేతిక నిపుణులు ఉన్నారని, సిట్ దర్యాప్తుపై ఊహాజనిత సందేహాలు లేవనెత్తడం సరికాదని ఏజీ తెలిపారు. సిట్కు ఐజీస్థాయి అధికారి (టాప్-10లో) సారథ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన వాళ్లకు సిట్ దర్యాప్తులో భాగంగా నోటీసులు ఇవ్వడం సమర్థనీయం అని చెప్పారు. సిట్ దర్యాప్తును ఏమాత్రం శంకించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంలో దర్యాప్తు జరుగుతున్నదని స్పష్టంచేశారు. అభ్యర్థులకు న్యాయం చేయాలనే పరీక్షల రద్దు, వాయిదా నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు. పరీక్షల్లో అత్యధిక మారులు సాధించిన విద్యార్థులను కూడా దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. ఈ కేసులో 20 మందిని నిందితులుగా గుర్తించామని చెప్పారు. ఇద్దరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకరు న్యూజిలాండ్లో ఉన్నారని తెలిపారు. 40 మంది సాక్షులను సిట్ విచారించిందని కోర్టుకు తెలిపారు.
టీఎస్పీఎస్సీ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రశ్నపత్రం కొనుగోలు కేసులో అరెస్టయిన ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్ ( ఏ 17), సుస్మిత (ఏ 18) వేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అలాగే, తిరుపతయ్య (ఏ 15) బెయిల్ను సైతం కోర్టు కొట్టేస్తూ తీర్పుచెప్పింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ (ఏ 1), రాజేంద్రకుమార్ (ఏ 14) పిటిషన్లను మంగళవారానికి వాయిదా వేసింది.