హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.లక్ష కోట్లు. ఇదీ ఎనిమిదేండ్ల స్వరాష్ట్ర పాలనలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం విలువ. ఇంతింతై.. అన్నట్టుగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగుతూనే ఉన్నది. దీంతో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా 6.60 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కేవలం ఎనిమిదేండ్లలోనే ధాన్యం కొనుగోళ్లు ఆరింతలు పెరగ్గా.. కొనుగోలు విలువ ఎనిమిదింతలు పెరగడం గమనార్హం. మరీ ముఖ్యంగా గత నాలుగేండ్లుగా తెలంగాణ రైతు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఈ విశ్వరూపం వెనుక అడుగడుగునా రాష్ట్రప్రభుత్వ అండ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి గోస తీరడం, రైతుబంధుతో పెట్టుబడి సాయం అందడంతో రాష్ట్రంలో రైతు రాజుగా మారాడు. మొత్తం పంట కొనుగోళ్లలో గత నాలుగేండ్లలో కొన్నదే 80 శాతం ఉండటం విశేషం. ఎనిమిదేండ్లలో రూ.1.07 లక్షల కోట్ల విలువైన 6.60 కోట్ల టన్నుల ధాన్యం కొంటే, అందులో 2018-19 నుంచి 2021-22 వరకు రూ.84,328.46 కోట్ల విలువైన 4.50 కోట్ల టన్నులు ధాన్యం ఉన్నది.
కేసీఆర్ వేసిన మార్గం
ప్రభుత్వం అండగా ఉంటే పొలాల్లో బంగారం పండిస్తామని తెలంగాణ రైతులు నిరూపించారు. రాష్ట్ర రైతుల విజయగాథకు వెన్నుదన్నుగా నిలిచింది మాత్రం ముఖ్యమంత్రి కేసీఆరే. రాష్ట్రంలో సాగు పండుగలా మారటం వెనుక సీఎం కేసీఆర్ అవిశ్రాంత కృషి ఉన్నది. ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధుతో వ్యవసాయాన్ని పండుగ చేశారు. దీంతో రాష్ట్రంలో పసిడి పంటల ఉత్పత్తి మొదలైంది. మరీ ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం, ఉత్పత్తి భారీగా పెరిగింది. వరి సాగులో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడు.
అట్టడుగు నుంచి అందలానికి
వరి సాగులో, ధాన్యం ఉత్పత్తిలో ఒకప్పుడు తెలంగాణది అట్టడుగు స్థానం. కానీ ఇప్పుడు దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించడం గమనార్హం. వరి సాగులో రారాజుగా ఉన్న పంజాబ్ను త్వరలోనే తెలంగాణ అధిగమించబోతున్నది. గత ఏడాది సుమారు 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసిన తెలంగాణ, ఈ ఏడాది ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్నది. అదే జరిగితే మొదటి స్థానం ఖాయం. పచ్చబడుతున్న తెలంగాణపై కక్ష గట్టిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రైతుల నుంచి యాసంగిలో ధాన్యం(బాయిల్డ్ రైస్) తీసుకోబోమని షరతులు పెట్టింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వరి రైతులకు అండగా నిలిచింది. వారు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి ఆదుకొన్నది.
ఇంతింతై..
కేసీఆర్ వల్లే సాధ్యమైంది
రాష్ట్రంలో వ్యవసాయా న్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. రూ.లక్ష కోట్ల ధాన్యం కొనుగోలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని అవరోధాలు ఎదురైనా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎంత ఖర్చయినా ఏటా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతులపై ఆయనకున్న ప్రేమకు ఇది నిదర్శనం.
– గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి
రైతును రాజు చేయడమే సీఎం లక్ష్యం
తెలంగాణ రైతును రాజు చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. అందుకే రైతు గోస తీర్చేందుకు దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఆ పథకాలే రైతులకు శ్రీరామ రక్షగా మారాయి. ఎనిమిదేండ్లలో వరి రైతుల ఖాతాల్లో ఏకంగా రూ.లక్ష కోట్లు జమ చేయడం అద్భుత విషయం.
– పల్లా రాజేశ్వర్రెడ్డి,రైతుబంధు సమితి అధ్యక్షుడు