హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాల్లో కారుణ్య ఉద్యోగావకాశం కల్పించింది. శనివారం ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గురుకుల విద్యావిధానాన్ని తీసుకొచ్చి, పకడ్బందీగా అమలు చేస్తున్నదని తెలిపారు. గురుకుల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నదని, బాలబాలికల కోసం వేర్వేరుగా ప్రారంభమైన పాఠశాలలు.. నేడు అనేక మందికి దారి దీపాలవుతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. కారుణ్య నియామక పత్రాలు పొందిన వారంతా విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గురుకుల విద్యాసంస్థల్లో చదువుకొన్న తమకు అదేసంస్థలో ఉద్యోగావకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కొప్పులకు ఉద్యోగాలు పొందిన వారు కృతజ్ఞతలు తెలియజేశారు.