హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): మేడారం మహాజాతరకు వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేసింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ప్రాచుర్యం, ఆదరణ పొందుతున్న ‘హోంస్టే’ సౌకర్యాన్ని కల్పించే ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. ములుగు జిల్లా గోవిందరావుపేట, తాడ్వాయి (పస్రా టు మేడారం, తాడ్వాయి టు పస్రా) మండలాల్లోని పది గ్రామాల్లో హోంస్టే సౌకర్యాన్ని కల్పించేందుకు అవసరమైన నిధులు, అనుమతులు ఇవ్వాలని గిరిజన సంక్షేమశాఖ కేంద్రాన్ని కోరింది.
మేడారం, కన్నెపల్లి, ఊరట్టం, రెడ్డిగూడెం, నార్లాపూర్, కామారం తదితర పది గ్రామాల్లో హోంస్టే సౌకర్యం కల్పించడం ద్వారా భక్తులకు సౌకర్యాలతోపాటు మేడారం చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రాచుర్యం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మేడారం సమీపంలోని మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, బొగత జలపాతం, గోదావరి నదిపై నిర్మించిన ముళ్లకట్ట, లక్నవరంలోని వేలాడేవంతెన, ప్రపంచ కట్టడంగా ఖ్యాతిపొందిన రామప్పగుడి వంటి అనేక దర్శనీయ, సందర్శనీయ, పర్యాటక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో హోంస్టేకు గొప్ప ఆదరణ ఉంటుందని కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో ప్రభుత్వం పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తే రాష్ట్రంలో తొలిసారిగా ‘హోంస్టే’ పొందిన ఖ్యాతిని మేడారం దక్కించుకోనున్నది.
దేశ, విదేశాల్లో హోంస్టేకు ఆదరణ పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1,977 హోం స్టే కేంద్రాలు ఉన్నాయి. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల (జాతర ప్రాంతాల్లో భక్తులు)కు ఆయా ప్రాంతాల సమీప ప్రజల ఇండ్లు, స్థలాలను ఆవాస ప్రాంతాలుగా రూపొందించటం, అక్కడి నుంచి సమీప పర్యాటక ప్రాంతాలకు వాహన సౌకర్యం, భోజన, నివాస సదుపాయాలు కల్పించడమే హోంస్టే లక్ష్యం. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
రానున్న ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరను ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. జాతర నిర్వహణ భాగస్వామ్య శాఖల సమన్వయంతో భక్తులకు విస్తృత అవగాహన, ప్రచారం నిర్వహించే కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి సమీక్షా సమావేశంలో సూచించారు. జాతరకు జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో ప్లాస్టిక్ వాడకం కూడా పెరుగుతున్నదని, అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ నిల్వలు పేరుకుపోవడం వల్ల ప్రకృతికి తీరని నష్టం వాటిల్లుతుందని, దీనిని నివారించాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది.