హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్ హోదాను కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఇటీవలే మెమో-83 జారీ చేశారు. డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్గా 18 ఏండ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు ఇక నుంచి ప్రొఫెసర్ హోదా పొందుతారు.
ఈ నిర్ణయంపై తెలంగాణ గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఈ) నేతలు హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి సబిత, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అధ్యక్షుడు సంగి రమేశ్, ప్రధాన కార్యదర్శి ఈ బ్రిజేశ్, చైర్మన్ డాక్టర్ కే విజయ్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.